ప్రస్తుత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శరవేగంగా ఆధునీకరణ జరుగుతుండడంతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కడుపున పుట్టినవారు పట్టించుకోకపోవడంతో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, తరతరాలకు వారధులుగా నిలిచే వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో ప్రయోగాత్మకంగా వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్షం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని రాజన్నసిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు స్థానిక ఎస్టీ హాస్టల్ భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని యంత్రాంగం నిర్ణయించింది. సిరిసిల్ల కలెక్టర్ ఆదివారం ఈ భవనాన్ని పరిశీలించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించగా, మరో పదిహేను రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది.
ఎల్లారెడ్డిపేట, జూలై 18 : ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వృద్ధులకు భరోసా కరువవుతున్నది. పిల్లలు ఉద్యోగమో.. లేదా ఉపాధో.. వ్యవసాయ పనుల మీద బయటికి వెళ్తే ఇండ్లల్లో ఒంటరిగా గడుపుతున్నారు. కొన్నిచోట్ల నిరాదరణకు గురవుతున్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకూ ఎవరు లేక ఆవేదనకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదరించేవారు లేకనో.. ఆరోగ్యం దెబ్బతినో తనువు చాలిస్తున్నారు. ఇది గమనించిన మంత్రి కేటీఆర్ పెద్ద మనసుతో ఓ ఆలోచన చేశారు. జీవితచరమాంకంలో వృద్ధ్దులు ఆనందంగా, ఆరోగ్యంగా గడిపేందుకు ఓ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. అమాత్యుడి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
స్థానిక ఎస్టీ హాస్టల్ ఖాళీగా ఉండడంతో అధికారులు ఆదివారం ఆ భవనాన్ని పరిశీలించారు. మరో పది హేను రోజుల్లో అందుబాటులోకి తేనున్నారు. అందులో మొదటగా 15 మందికి బెడ్లతో వసతి కల్పించనున్నారు. నిత్యం భోజనం అందించనున్నారు. అలాగే ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు వారి బాగోగులు చూసేందుకు ఒక కేర్టేకర్ను నియమిస్తారు. అలాగే వార్తా పత్రికలు అందుబాటులో ఉంచడంతోపాటు చెస్, వైకుంఠపాళి, క్యారం బోర్డులాంటి ఆట వస్తువులను ఏర్పాటు చేస్తారు. కూర్చుని మాట్లాడుకునేందుకు ఒక వేదికను నిర్మించనున్నారు. అంతే కాకుండా టీవీలు, లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాయామం చేసేందుకు అవసరమైన సాధనాలు, ఫిజియో థెరఫీ పరికరాలను అందులో ఉంచనున్నారు.
హరిదాస్నగర్లో 60 మంది, సింగారంలో 80 మందితో సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా తమ ఇంటిలో.. కుటుంబాల్లో మంచీ చెడుల గురించి చర్చిస్తున్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
వృద్ధుల ఉల్లాసం కోసమే..
వృద్ధ్దులు జీవితచరమాంకంలో ఉల్లాసంగా గడిపేందుకు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ భవనాన్ని పరిశీలించాం. ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు వారి కాలక్షేపానికి అవసరమైన సాధనాలను అందుబాటులో ఉంచుతాం. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం.
– లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి (రాజన్న సిరిసిల్ల)