కలెక్టరేట్, మార్చి 09 : బాజా భజంత్రీలు.. మేలా తాళాలు ఒకవైపు.. పెద్ద ఎత్తున అతిథులు.. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మరోవైపు.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భం అది. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించిన వివాహ వేడుకకు..కరీంనగర్ లోని కళాభారతి ఆడిటోరియం వేదిక అయింది. ఈ పెండ్లికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెద్దలుగా వ్యవహరించారు. ఈ వివాహ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సధనంలో పెరిగిన ఓ అనాథ యువతికి ఆదివారం కరీంనగర్ కళాభారతిలోపమేలా సత్పతి ఆధ్వర్యంలో వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. అనాథ అయినా ఎలాంటి లోటు రాకుండా అధికారులే అమ్మానాన్న అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు లేకపోవడంతో 2017లో పూజ (మౌనిక)ను కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడ అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూశారు. ఇంటర్ తర్వాత ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సు చేసి ఇంటర్నిషిప్ చేస్తుండగా పెద్దపెల్లి జిల్లా మంథనికి చెందిన సాయి తేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం యువతి అధికారులకు చెప్పడంతో.. యువకుడితో మాట్లాడగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు పెళ్లి నిశ్చయించారు.
అధికారులే పెళ్లి పెద్దలుగా మారి అన్ని పనులు చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పెళ్లికి వచ్చే అతిథులకు భోజనం ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి దంపతులను ఆశీర్వదించి.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తాను స్వయంగా రాసిన లెటర్ ను వధూవరులకు అందించారు. అదేవిధంగా మౌనిక వివాహానికి జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, జిల్లా యంత్రాంగం, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు వివిధ శాఖల అధికారులు అందరూ సహాయం అందించారు.
అనాథ యువతి మౌనికకు జిల్లా యంత్రాంగం తరఫున తన ఆధ్వర్యంలో వివాహం జరిపించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మౌనిక నర్సింగ్ వరకు చదివి ప్రయోజకురాలుగా మారిందని, ఆమెను మరింత ఉన్నత చదువులు చదివించాలని సాయి తేజ, వారి కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేశామని తెలిపారు. వారు కూడా తమ రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనాథలు ఎవరూ బాధపడవద్దని వారికి అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. అనాథలు ఎవరు లేరని బెంగ పెట్టుకోవద్దని, ప్రభుత్వం నిరంతరం తోడుగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అనాథ యువతికి వివాహం ప్రభుత్వా నిధులు, దాతల సహకారంతో జరిపించడం అభినందనీయమని తెలిపారు.