Collector Koya Sriharsha | కమాన్పూర్, జూలై 21 : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కమాన్పూర్, రామగిరి మండలాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ గుండారం ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయం, ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, పెంచికల్పేట్ గ్రామంలోని సింగరేణి భూములు, రామగిరి నూతన తహసీల్దార్ కార్యాలయం, మేడిపల్లి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గుండారం ఎంపీపీఎస్. పాఠశాలలో ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు బోధన అందించాలని, ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు పూర్తిస్థాయిలో అలవడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ బోధన, విద్యార్థుల హాజరు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కమాన్పూర్ మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం, మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి కొత్త భవనం నుంచే తహసీల్దార్ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రతీ దశను కచ్చితత్వంతో అమలు చేయాలని ఆదేశించారు. పెంచికల్పేట్ గ్రామంలోని సింగరేణి భూములను పరిశీలించిన కలెక్టర్, భూ వివాదాల పరిష్కారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ (ల్యాండ్ సర్వే)ఆధ్వర్యంలో సమగ్ర భూ సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లేబర్ రూమ్, వ్యాక్సినేషన్ విభాగాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పనితీరును మెరుగుపరచడంతో పాటు ఓపీ సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ఆరోగ్య సూచికలను నిర్దేశిత ప్రమాణాల మేరకు అమలు చేయాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్టాప్ డయేరియా కార్యక్రమం ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్)కార్యక్రమాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో కమాన్ పూర్ తహసీల్దార్ వాసంతి, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు వరలక్ష్మి, జగదీశ్, రామగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.