కరీంనగర్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ (Vinod Kumar) ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. జిల్లాలోని జమ్మికుంట మండలం వావిలాలలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షో ( Road show ) లో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి గ్యారెంటీ సర్కార్ కాదని, గారడీ సర్కారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉండేట్టు లేదని అన్నారు. నూటయాబై రోజుల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో కరీంనగర్కు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో పాటు ట్రిపుల్ ఐటీ (Triple IT) , నవోదయ పాఠశాలలు తెచ్చి విద్యాహబ్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
2014 నుంచి 2019వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకువచ్చానని వెల్లడించారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ తీసుకువచ్చానని, మానేరు నదిపై తీగల వంతెన నిర్మాణం, మానేరు రివర్ ప్రంట్, ఐటీ టవర్, శాతవాహన యూనివర్సిటీ దగ్గర నైట్ లైట్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఒక్క గుడి తేలేదు. ఒక్క బడి తేలేదని ఆరోపించారు.