గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద.. ఇన్నాళ్లు గ్రామాలవారీగా గుర్తించిన పనులకు ఆమోదం పొంది.. తద్వారా పనులు చేపట్టే వారు. అలాగే ఎన్ని పనులైనా చేసే అవకాశముండేది. ఒక గ్రామానికి ఇన్ని పనులు మాత్రమే చేపట్టాలన్న నిబంధన లేదు. దీంతో కూలీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పనులు, అలాగే తక్కువ ఉన్న చోట తక్కువ పనులు చేస్తూ వచ్చారు. ఇంకా అవసరాలకు అనుగుణంగా ఒక గ్రామంలోఎక్కువ, తక్కువ పనులు చేసే వారు. కానీ, కేంద్రం తాజాగా కొత్త నిబంధనలు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. ఏడాది మొత్తంగా ఒక గ్రామంలో 20 పనులకు మించి చేయరాదనే షరతు పెట్టింది. నిజానికి గత ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే ఉమ్మడి జిల్లాలో సుమారు ఒక్కో గ్రామంలో 40 నుంచి 45కు పైగా పనులు చేపట్టి ఉపాధి కల్పించారు. ఇక నుంచి 20 పనులు మాత్రమే చేయాలన్న నిబంధన ఉండడంతో.. దాదాపు సగం పనులకు కోత పడే ప్రమాదమున్నది.
గతంలో కూలీలు పనిచేసే చోట మంచినీరు, టెంట్ వేసుకొనే సౌకర్యం ఉపాధి హామీ నిధుల ద్వారానే కల్పించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి మోదీ సర్కారు తప్పుకొని, గ్రామ పంచాయతీలపై భారం వేసింది. మన రాష్ట్రంలో ప్రతి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసవిని దృష్టిలో పెట్టుకొని అదనపు కూలి చెల్లిస్తారు. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్లో ఆ వెసులుబాటు లేదు.
కరువు కాటకాల్లోనూ గ్రామీణ వ్యవస్థకు జీవం పోసి.. లక్షలాది మందికూలీల బతుకుదెరువుకు భరోసానిచ్చిన ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. కొన్నాళ్లుగా ఈ పథకం అమలు బాధ్యతల్లోంచి ఒక్కొక్కటిగా తప్పుకొంటూ రాష్ర్టాలపైకి భారం నెడుతున్నది. తాజాగా పనుల్లో కోతలు పెడుతూ.. కొత్త నిబంధనలు తెచ్చింది. అంతేకాదు, వాటిని వచ్చే ఆగస్ట్టు ఒకటి నుంచే అమల్లోకి తేవాలని ఆదేశించింది. కేంద్రం నూతంగా తీసుకున్న నిర్ణయం ద్వారా.. లక్షలాది మంది కూలీలకు పని దొరకకుండా పోవడంతోపాటు వారి కుటుంబాలు ఆగమయ్యే ప్రమాదమున్నది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపైనా ప్రభావం పడనున్నది.
కరీంనగర్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ ఈజీఎస్) 2005 ఆగస్టు 25 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని వయోజనులు, అలాగే దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ఉపాధి చూపాలన్న లక్ష్యంతో ఈజీఎస్ అమలవుతున్నది. ప్రధానంగా ప్రతి గ్రామీణ కుటుంబంలో పని కావాలని కోరిన వారికి ఆ గ్రామ పరిధిలోనే 100 పని రోజులు కల్పించి.. కనీస వేతనం వచ్చేలాగా చట్టపరమైన హామీని ‘నరేగా’లో పొందుపరిచారు. అలాగే సుమారు మూడో వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించాలని అందులో పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయి. నిజానికి ఉపాధి హామీ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కూలీ చేసుకునే కుటుంబాలకు పెద్ద బాసట దొరికింది. అంతేకాదు, ఎంత కరువున్నా.. వంద రోజుల ఉపాధి లభించేంది.
లక్షకుపైగా కూలీలకు ఉపాధి దూరం?
కేంద్రం కొత్తగా పెట్టిన నిబంధన వల్ల లక్షలాది మంది కూలీలకు ఉపాధి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఉదాహరణకు చూస్తే.. జగిత్యాల జిల్లాలో మొత్తం లక్షా 80 వేల జాబ్ కార్డులుండగా, 3.13 లక్షల మంది కూలీలున్నారు. అందులో లక్షా 65 వేల మంది కూలీలు యాక్టివ్గా పని చేస్తున్నారు. జిల్లాలో ఈ యేడాదికి సుమారు 16 వేల పనులను గుర్తిస్తూ.. చేయిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్న 380 పంచాయతీల వారీగా చూస్తే.. ప్రతి గ్రామంలోనూ సుమారు 40కిగా పైగా పనులు చేశారు. అలాగే కరీంనగర్ జిల్లాలో 1,47,082 జాబ్కార్డులుండగా.. ఉపాధి కూలీలు 3,09,618 మంది ఉన్నారు. అందులో ఉపాధి కల్పించిన కూలీల సంఖ్య 1,00,949 ఉండగా, సరాసరి వేతనం 136గా నమోదైంది. ఏటా చిన్నాచితక పనులన్నీ కలిపి సుమారు 14 వేలకుపైగా పనులు చేస్తున్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఇదే స్థాయిలో పనులు జరుగుతున్నాయి. కొత్త నిబంధన వల్ల ఉమ్మడి జిల్లాలోని సుమారు లక్ష మంది కూలీలపై ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు పడడంతోపాటు వ్యవసాయరంగం పండుగలా సాగుతున్నది. తాత్కాలికంగా కొత్త నిబంధనల ప్రభావం పెద్దగా కనపడకపోయినా.. భవిష్యత్లో మాత్రం కచ్చితంగా ఉండే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పుకొంటున్న కేంద్రం..
నిజానికి ఉపాధిహామీ పథకం అమలులో కేంద్రం ఆది నుంచీ శీతకన్ను ప్రదర్శిస్తున్నది. బడ్జెట్లో ఈ పథకానికి భారీగా నిధుల కోత పెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఈ కోతకు అనుగుణంగా ఒక్కో నిబంధన, షరతులను వేర్వేరుగా విధిస్తున్నది. ఎండకాలంలో పనులు జరిగే స్థలం వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యం వంటివి గతంలో ఉపాధిహామీ నిధుల నుంచి చేపట్టే వారు. ప్రస్తుతం ఈ పనుల నుంచి కేంద్రం తప్పుకొని, వీటి బరువు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టింది. ఇదే సమయంలో.. తాజాగా పనుల్లో కోతలు పెట్టి, మున్ముందు పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. అంతేకాదు, కొత్త నిబంధన వల్ల కూలీలకే కాదు గ్రామీణ ప్రాంతాల్లో పలు పనులు నిలిచే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా నీటి నిల్వల పెంపునకు తవ్వే చిన్న కందకాలు, చెరువుల్లో పూడిక తొలగింపు, కాలువల మరమ్మతులు, మొక్కల పెంపకం, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా గతంలో ఉపయోగించిన సాఫ్ట్వేర్ను పూర్తిగా మార్చివేసి.. కొత్త సాఫ్ట్వేర్తో ఈ పథకాన్ని కేంద్రం తన గుత్తాధిపత్యంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.
పనిదినాలు తగ్గే పరిస్థితి ఉంది
మార్చి నుంచి కొత్త సాఫ్ట్వేర్ వస్తే ఇబ్బందులు ఎదురవుతయి. ఇంతకుముందు ఒకరోజు ముందు ఉపాధిహామీ పనుల గురించి డప్పు చాటింపు చేసి తెల్లారి వచ్చినవారి మస్టర్లను రాసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మస్టర్లు డౌన్లోడ్ చేసినంక పని చూపాల్సి ఉంటుంది. ఒక్కోసారి మస్టర్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి అతని వ్యక్తిగత కారణాల వల్ల రాకపోవచ్చు. అలాగే, ఉపాధి పనిచేసే వాళ్లు ఎక్కువ మంది చదువుకోని వాళ్లుంటారు. ఇంతకు ముందు డప్పు చాటింపు చేయిస్తే చూసుకుని వచ్చేవాళ్లు. ఇప్పుడు అది ఇబ్బందిగా మారుతున్నది. ఎండాకాలం ఉదయమే వెళ్లి కొలతల ప్రకారం పనిపూర్తి చేసుకుని ఇంటివద్ద చిన్నాచితక పనులు చేసుకునేది. ఇప్పుడు పని మొదలు పెట్టినప్పుడు ఒకటి నాలుగుగంటల వ్యవధిలో మరో ఫొటో పెట్టే నిబంధన కొంత ఇబ్బంది కలిగిస్తున్నది. ఇప్పుడు మళ్లీ పనులు తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే కూలీలకు పనిదినాలు తగ్గుతయి. చాలా మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మొత్తానికి కేంద్రం తీసుకుస్తున్న కొత్త నిబంధనలు రాష్ర్టాల అభివృద్ధి పనులకు ఆటంకంగా మారే ప్రమాదమున్నది.
– పడిగెల రవీందర్, తిమ్మాపూర్ సర్పంచ్ (ఎల్లారెడ్డిపేట)
ఉపాధిని దెబ్బతీయొద్దు
ఉపాధిహామీ ద్వారా తిమ్మాపూర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నం. సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, డంప్ యార్డు, శ్మశాన వాటిక.. ఇలా గ్రామానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకున్నం. అలాగే, ఎంతోమంది పేదలు ఉపాధిహామీ పనికి వెళ్లి బతుకుతున్నరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పేరు వస్తున్నదని, మరో రాజకీయంగానో.. ఉపాధిని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయద్దని కోరుతున్న. ఎప్పటిలాగే ఉపాధిహామీని ముందుకు తీసుకెళ్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్న. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష లేకుండా కొనసాగించాలి.
– దుండ్ర నీలమ్మ, తిమ్మాపూర్ సర్పంచ్
ఉపసంహరించుకోవాలి
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను కుదించడం అన్యాయం. కుదిస్తే పేద ప్రజలతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. పేదలకు ఉపాధి కల్పించడంలో ఈ పథకం ఇప్పటి వరకు భేష్గా ఉన్నది. ఇప్పుడు పనుల్లో కోత పెట్టడానికి కేంద్రం ఆలోచన చేయడం దుర్మార్గం. దీని వల్ల గ్రామాల్లో అశించిన అభివృద్ధి జరగక ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అవసరమైన రోడ్లు వేసుకున్నం. చెరువుల్లో పూడిక మట్టి తొలగించుకున్నం. నీటి నిల్వకు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, ఎస్సారెస్పీ కాల్వల్లోని పూడిక మట్టి తీసేందుకు, ఫీల్డ్ చానల్, హరితహారంలో మొక్కల సంరక్షణ, గుట్టల ప్రాంతాల్లో కాంటూరు కందకాల తవ్వకాలు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు, పార్క్లు, నర్సరీల నిర్వహణ, రైతులకు ఉపయోగపడే అనేక పనులు చేపట్టినం. కానీ, ఇప్పుడు పనులు కుదించడం వల్ల ఇవన్నీ చేసే అవకాశం ఉండదు. ఈజీఎస్ పథకాన్ని కుదించే ఆలోచనలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే పేదల ఆగ్రహానికి గురికాక తప్పదు. – ఆళ్ల రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు, పొత్కపల్లి (ఓదెల)