జగిత్యాల, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): నిజాం హయాంలో ప్రారంభమైన చెక్కర కర్మాగారాన్ని చంద్రబాబు అమ్ముతుంటే ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి చోద్యం చూసింది కాంగ్రెస్సేనని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. ఆయన తెచ్చిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నదని, పేదలకు కొండంత అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మెట్పల్లిలోని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నాయకుడు జీవన్రెడ్డి అంటున్నారని, ఈ వ్యాఖ్యలు చూస్తే జీవన్రెడ్డికి సీనియారిటీ ఉంది కానీ, సిన్సియారిటీ లేదని అర్థమవుతుందని విమర్శించారు. 1937లో దేశానికి స్వాతంత్య్రం రాకముందు నిజాం ప్రభువు షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని, అందులో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నష్టాల ఊబిలో మునిగిపోవడానికి కాంగ్రెస్ పట్టింపులేని తనమేనని ధ్వజమెత్తారు. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 2015లోనే జీవో నెంబర్ 28ని జారీ చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసిన విషయం తెలుసుకొని, ఫ్యాక్టరీని కొన్న బీజేపీ మాజీ ఎంపీ చెప్పా పెట్టకుండా లాకౌట్ ప్రకటించి ఫ్యాక్టరీలను ఖాయిలాపడిన సంస్థల శాఖ పరిధిలోకి నెట్టి వేశాడన్నారు. ఫ్యాక్టరీ ఆస్తులను తాకట్టు పెట్టి 150 కోట్ల మేర అప్పులు సైతం తీసుకున్నారన్నారు. రైతులకు, కార్మికులకు బీజేపీ నాయకుడు బకాయిలు ఎగ్గొట్టిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం 66 కోట్లు చెల్లించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రైతులను, కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడేది సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
దొరలు, ప్రజలు అంటూ రాహుల్ గాంధీ ఏమేమో మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డా రు. మంథనిలో దొర అయిన శ్రీధర్బాబును పకన పెట్టుకొని రాహుల్గాంధీ దొరల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, దళితబిడ్డ, కవ్వంపల్లి సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఇవ్వనివారు, దొర శ్రీధర్ బాబును మాత్రం మాట్లాడించారన్నారు. జగిత్యాలలో రాహుల్ ప్రసంగాన్ని తర్జుమా చేయడానికి దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ను కాకుండా దొరైన జీవన్రెడ్డికి ఎందుకు అవకాశం ఇచ్చారు? లక్ష్మణ్కుమార్ తర్జుమా చే యలేరా? అని ఆమె ప్రశ్నించారు. సంపూర్ణంగా దొరతత్వం తమ వద్ద పెట్టుకొని, రాహుల్ గాంధీ దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా బీడీ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరేలా పథకం రూపకల్పన చేశారన్నారు. వీరితోపాటు సాధారణ మహిళలకు సైతం కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా నెలకు 3వేల పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పారు. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా’ పథకం బాగున్నదని, రైతు బీమా తరహాలో పేదలకు 5 లక్షల మేర బీమా వర్తిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం పెంచిన ధరలతో గ్యాస్ సిలిండర్ మనకు అందకుండా పోయి మళ్లీ కట్టెల పొయ్యి పెట్టుకునే దుస్థితి వచ్చిందని, ఈ భారాన్ని తగ్గించేందుకే సీఎం కేసీఆర్ గ్యాస్ సిలిండర్ను 400కు అందించాలని మంచి నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
జగిత్యాల, నిజమాబాద్ జిల్లాల్లో గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని కవిత చెప్పారు. ఒకప్పుడు పాలకుల పట్టింపులేనితనం వల్ల బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లారన్నారు. ప్రాజెక్టులతో సాగునీరు, 24గంటల కరెంట్, పెట్టుబడికి రైతుబంధు ఇస్తుండడంతో రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని చెప్పారు. దీనిని చూసే ఎంతో మంది స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన వారు సైతం తిరిగి రావాలని కోరారు. ఒకవేళ రాలేక అక్కడే ఉపాధి పొందుతున్న వారి సంక్షేమం కోసం సైతం పనిచేస్తున్నామని, చేస్తూనే ఉంటామన్నారు. గల్ఫ్ కార్మికులతో తనకు ఎక్కువ అనుబంధం ఉందని, వారు కోరిన మేరకు రేషన్కార్డుల నుంచి పేర్లను తొలగించలేదన్నారు. అలాగే గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఆదాయంతో పనిలేకుండా వారి తల్లిదండ్రులకు పెన్షన్ను సైతం అందిస్తున్నామన్నారు. గల్ఫ్ కార్మికులకు సైతం బీమా వర్తించేలా సీఎం కేసీఆర్ 93 లక్షల కుటుంబాలను బీమా పరిధిలోకి తెస్తున్నారన్నారు. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా’ పథకం గల్ఫ్ కార్మికులకు భరోసాను ఇస్తుందన్నారు.
కాంగ్రెస్ రాష్ర్టానికో మాట చెబుతున్నదని కవిత మండిపడ్డారు. తెలంగాణలో పండించిన పంటకు బోనస్ ఇస్తామని ఆ పార్టీ అంటున్నదన్నారు. కానీ, అదే పార్టీ పాలిస్తున్న ఛత్తీస్గఢ్లో ఎకరానికి 20 క్వింటాళ్ల పరిమితి విధించిందని, ఆ పరిమితి దాటితే ఒక గింజను కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం లేదన్నారు. కానీ పదేండ్లుగా వేల కోట్లు వెచ్చించి, రైతులు పండించిన చివరి గింజ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని స్పష్టం చేశారు. మూడు గంటలు మాత్రమే కరెంటు ఇచ్చి రైతులను గుల్ల చేయాలన్నది కాంగ్రెస్ ఉద్ధేశమని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ హయాంలో కేవలం ఒకే ఒక బీసీ సంక్షేమ హాస్టల్ ఉండేదని, ఇప్పుడు 34 సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి, రాహుల్గాంధీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాలన్నారు.
సింగరేణి, షుగర్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్కు, రాహుల్గాంధీకి లేదన్నారు. సిర్పూర్లోని స్పిన్నింగ్ మిల్లును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి కేంద్రంలో జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మూసివేసిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మూసివేసింది కాంగ్రెస్సే అన్నారు. ఈ దేశంలో ప్రైవేట్ వాళ్లకు బొగ్గు అమ్ముకోవచ్చని నేర్పించి ఆనవాయితీగా చేసిందే కాంగ్రెస్ అని ఎండగట్టారు. తాడిచెర్ల బొగ్గు గనిని ప్రైవేట్ వాళ్లకు అప్పగించిందని విమర్శించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉంటే గోల్డెన్ హ్యాండ్షేక్ అనే దిక్కుమాలిన పథకాన్ని పెట్టి అనేకమంది ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకునేలా బలవంతం పెట్టింది ఆ పార్టీనే అన్నారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని బొగ్గు గనులను మనకివ్వాలని కేంద్రంతో కొట్లాడి సాధించారన్నారు. అనేక గనులు తెరిచి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిన మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. దాదాపు 18 వేలకు పైగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని, నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5వేలకు పైగా కొత్తగా ఉద్యోగాలు కల్పించామన్నారు. కోల్ ఇండియాలో కూడా లేనటువంటి అదనపు వేతనంతో కూడిన సెలవు దినాలు, సింగరేణి ఉద్యోగులకు కల్పించామన్నారు. గతంలో సింగరేణి కార్మికులకు మాత్రమే కార్పొరేట్ దవాఖానలో వైద్య సౌకర్యాలు పొందేందుకు అవకాశం ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల కుటుంబసభ్యులకు, వారి తల్లిదండ్రులకు సైతం కార్పొరేట్ దవాఖానలో ఉచితంగా వైద్యం పొందే అవకాశం కల్పించిందన్నారు. కాంగ్రెస్ డిస్మిస్ చేసిన 600 మంది సింగరేణి కార్మికులను తిరిగి ఉద్యోగాలకు తీసుకున్నది సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. సింగరేణిలో 30శాతానికి పైగా వాటాలను కార్మికులకు పంచడమే కాకుండా గతంలో ఉన్న బకాయిలను సైతం విడుదల చేశామన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి రాజకీయాల్లో సీనియార్టీ ఉంది. కానీ, ఆయనకు సిన్సియారిటీ లేదు. జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడు. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలువడం సరికాదు. నేనేమి మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాణి లెక వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదు. జీవన్రెడ్డి దిగజారిపోయి, తన హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి పవిత్రమైన బతుకమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అసంబద్ధంగా ఉన్నది.
ఆయన వయసు ఏంది? ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంది? ఆయన స్థాయి, గౌరవం ఏంది? ఎన్నికల్లో గెలుపు కోసం ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉన్నదా..? అలాంటి జీవన్ రెడ్డిని పకన పెట్టుకొని రాహుల్ గాంధీ జగిత్యాలలో ముచ్చట్లు చెప్పడం ఎంత వరకు సమంజసం. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మున్సిపల్ చైర్పర్సన్ సుజాత, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.