మహా నగరాల్లోనే మాత్రమే కనిపించే నైట్ ఫుడ్ బజార్లు ఇప్పుడు కరీంనగరంలోనూ వెలుస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీ వద్ద సకల సౌకర్యాలతో ఏర్పాటవుతున్నాయి. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ మార్కెట్కు ఇటీవలే వేలం పూర్తికాగా, నేడు మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ వెజ్, నాన్వెజ్ ప్రియుల కోసం ఏర్పాటు చేసిన ఎనిమిది స్టాళ్లు సాయంత్రం 6 నుంచి రాత్రి 12గంటల వరకు ఓపెన్ చేసి ఉండనున్నాయి. ఇవి నగరప్రజలతోపాటు రాత్రి పూట జర్నీలు చేసేవారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 4: కరీంనగరం సరికొత్తగా మారుతున్నది. మహానగరాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యానికి ఓపెన్ జిమ్లు, పార్కులు ఏర్పాటు చేసిన బల్దియా, పెద్ద పెద్ద నగరాల్లో కనిపించే నైట్ ఫుడ్ బజార్లను తీసుకొస్తున్నది. తాజాగా శాతవాహన యూనివర్సిటీ వద్ద సకల సదుపాయాలతో ఏర్పాటు చేసింది. అందులో నాలుగు వెజ్ స్టాల్స్, నాలుగు నాన్ వెజ్ స్టాల్స్ను నెలకొల్పారు. వినియోగదారులు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లతో పాటు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ఆట వస్తువులను సిద్ధం చేశారు. ఇంకా మహిళలు, పురుషులకు వేర్వురుగా మూత్రశాలలు కూడా నిర్మించారు. ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలం కేటాయించారు. అయితే ఈ స్టాల్స్ను ఇటీవలే ఓపెన్ వేలం ద్వారా వ్యాపారులకు అప్పగించారు. గురువారం సాయంత్రం ఈ ఫుడ్ బజార్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ మార్కెట్ రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించనుండగా, వివిధ రకాల బిర్యానీ సహా వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, స్టార్టర్స్ దొరకనున్నాయి.
రోజంతా పనుల్లో బీజీగా ఉండే ప్రజలు, రాత్రి పూట జర్నీలు చేసేవారు భోజనం చేసేందుకు యూనివర్సిటీ వద్ద నైట్ ఫుడ్ బజార్లు ఏర్పాటు చేశాం. అన్ని సదుపాయాలతో సిద్ధం చేశాం. నాణ్యమైన ఆహారం అందించేలా చూడాలని వ్యాపారులకు సూచించాం. రాత్రిళ్లు ఇక్కడికి వచ్చే ప్రజల రక్షణకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ ఫుడ్ బజార్ను నగర ప్రజలందరూ వినియోగించుకోవాలి.
– వై సునీల్రావు, కరీంనగర్ మేయర్