చెట్ల కింద, వరండాల్లో విద్యాబోధనకు కాలం చెల్లింది. ఆహ్లాదాన్ని పంచే పచ్చని ప్రాంగణాలు, చదువుపై ఆసక్తిని పెంచేలా పెయింటింగ్స్తో కూడిన ప్రహరీలు, తళుక్కుమని మెరిసే భవనాలు, విశాలమైన డైనింగ్ హాళ్లు ఇలా సకల వసతులతో సర్కారు బడులకు సరికొత్త కళ వచ్చింది. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంతో సౌకర్యాలు సమకూరడంతో పాటు విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతుండడంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
-హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 9
హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది పాఠశాలల అభివృద్ధికి మన ఊరు-మనబడి కార్యక్రమం కింద మొదటి విడుతగా(పైలట్ ప్రాజెక్ట్) రాష్ట్ర ప్రభుత్వం సరిపడా నిధులు మంజూరు చేసింది. ఇందులో మూడు పాఠశాలల్లో 100శాతం పనులు పూర్తయ్యాయి. మరో మూడు స్కూళ్లలో సగానికి పైగా పనులు పూర్తి కాగా, మిగతా మూడు పాఠశాలల్లో ప్రగతిలో ఉన్నాయి.
కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా..
పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ (బాలురు), బోర్నపల్లి జడ్పీహెచ్ఎస్, గణేశ్నగర్లోని పాఠశాలల్లో డైనింగ్ హాల్, అధునాతన టాయిలెట్స్, విద్యుదీకరణ, కలరింగ్ పనులు పూర్తయ్యాయి. గణేశ్నగర్ పాఠశాల చుట్టూ ప్రహరీ సైతం నిర్మించారు. వాటిని త్వరలోనే అధికారులు, ప్రజాప్రతిధులు ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే గాంధీనగర్ ప్రాథమికోన్నత పాఠశాల, బోర్నపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, ఎమ్మార్సీ బిల్డింగ్ ఎదుట ప్రాథమికోన్నత, యూపీఎస్, బాలికల జడ్పీహెచ్ఎస్, గాంధీనగర్ ఎంపీపీఎస్లలో పనులు చకచకా సాగుతున్నాయి. ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలు తొలగిపోవడంతో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ సర్కారు బడులు బలోపేతమవుతున్నాయి.
ఇప్పుడెంతో సౌకర్యంగా ఉంది
మా పాఠశాలలో అదనంగా రెండు తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు వేర్వేరుగా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించడంతో ఎంతో సౌకర్యంగా ఉంది. ప్రహరీ నిర్మాణంతో పాఠశాల స్థలం అక్రమణకు అడ్డుకట్ట పడినట్లయింది. విద్యార్థుల సంఖ్య గతంలో 20- 25 ఉండగా, ఇప్పుడు 50- 60 వరకు పెరిగింది. మన ఊరు-మన బడి కార్యక్రమానికి మా పాఠశాలను ఎంపిక చేసిన మున్సిపల్ పాలకవర్గానికి రుణపడి ఉంటాం.
– భరత ప్రభాకర్, ఎంపీపీఎస్ గణేశ్నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
బడికి కొత్త కళ వచ్చింది
మన ఊరు-మనబడి కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు కింద మా స్కూల్ను ఎంపిక చేసి కార్పొరేట్ స్కూల్ తరహాలో మార్చడం సంతోషంగా ఉంది. బడిలో నూతనంగా విశాలమైన డైనింగ్ హాల్, మూత్రశాలలు నిర్మించారు. చాక్బోర్డులు, బేంచిలు ఏర్పాటు చేశారు. భవనానికి కలర్లు వేసి తీర్చిదిద్దడంతో కొత్త కళ వచ్చింది. మన ఊరు-మనబడి కార్యక్రమం చేపట్టిన సీఎం కేసీఆర్కు, సకాలంలో అన్ని పనులు చేయించిన మున్సిపల్ పాలకవర్గానికి మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
-ఎస్ అనురాధ, ప్రధానోపాధ్యాయిని, జడ్పీహెచ్ఎస్ (బాలురు)
మార్చిలోగా అన్ని పాఠశాలలో పనులు పూర్తి
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మార్చి నెలలోగా ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో తీర్చిదిద్దుతాం. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ఎక్కువగా చదువుకునేవారు. ఇప్పుడు ఆర్థికంగా ఉన్నవారు సైతం తమ పిల్లలను పంపుతుండడం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిదర్శనం.
– జీ సాంబరాజు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి, హుజూరాబాద్