హుజూరాబాద్/చొప్పదండి/మానకొండూర్/హుస్నాబాద్, డిసెంబర్ 3: కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తొలి ప్రయత్నంలోనే విజయం సాధించగా, మరో ఏడుగురు పట్టువదలని విక్రమార్కుల్లా మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదుసార్లు, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఏకంగా ఆరోసారి పోటీచేసి విజయం సాధించారు. హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్కు స్థాన చలనం కలిసొచ్చింది.
కోరుట్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తొలి ప్రయత్నంలోనే విజయాన్ని దక్కించుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్రావు వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించడంతో తన కొడుకు డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలోనే డాక్టర్ సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సంజయ్కు 72,115 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థిగా నిలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు 61,810 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జువ్వాడి నర్సింగరావుకు 39,647 ఓట్లు దక్కాయి. డాక్టర్ సంజయ్ 10,305 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. నియోజకవర్గంలో 2,40,855 ఓట్లు ఉండగా, 1,83,590 ఓట్లు పోలయ్యాయి.
హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాడి కౌశిక్రెడ్డి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలకేంద్రానికి చెందిన ఆయన ఎంబీఏ పూర్తి చేసి, రంజీ క్రికెటర్ అయ్యాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న అతని కుటుంబం 2001లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. కౌశిక్రెడ్డి తండ్రి సాయినాథ్రెడ్డి కేసీఆర్ బాటలో నడిచి 2002లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషించాడు. 2009లో కాంగ్రెస్లో చేరిన కౌశిక్రెడ్డి, రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. అప్పటి నుంచి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా సేవ చేస్తున్నాడు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ప్రత్యర్థి ఈటల రాజేందర్కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 2021లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆశీస్సులతో 2021 డిసెంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 మార్చి 4న ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా పని చేస్తూ ప్రజలతో మమేకమయ్యాడు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం పని చేస్తూనే ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వచ్చాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రజలు అక్కున చేర్చుకుని పదవిని కట్టబెట్టారు.
ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆరోసారి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఎట్టకేలకు విజయం సాధించారు. 2008లో తొలిసారి మేడారం రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అడ్లూరి లక్ష్మణ్కుమార్, అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై ఓటమి చెందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ధర్మపురి నుంచి మళ్లీ కొప్పులపై పోటీ చేసి రెండోసారి ఓడిపోయారు. 2010లో ఉప ఎన్నికలో వీరిద్దరే మరో సారి, 2014లో నాలుగోసారి, 2018లో ఐదోసారి సైతం వీరద్దరే పోటీ పడ్డా కొప్పుల ఈశ్వరే గెలిచారు. ఐదుసార్లు ఓటమిపాలైనా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆరో విజయాన్ని అందుకున్నారు. అడ్లూరికి 91,393 ఓట్లు రాగా, కొప్పుల ఈశ్వర్కు 69,354 ఓట్లు వచ్చాయి. 22,039 ఓట్ల మెజార్టీతో అడ్లూరి విజయం సాధించారు.
వేములవాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆది శ్రీనివాస్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. 2009లో వేములవాడ నియోజకవర్గం ఏర్పడగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా రెండు పర్యాయాలు పనిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చెన్నమనేని రమేశ్బాబు చేతిలో ఓడిపోయారు. తర్వాత 2010, 2014, 2018లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్బాబు చేతిలో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుపై విజయం సాధించి, తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యేగా ఎన్నికైన మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2004లో శాప్ చైర్మన్గా పనిచేశారు. 2009, 2014లో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యా రు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో పరాజయంపాలయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా నాలుగోసారి పోటీచేసి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్పై 56,794 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కల నెరవేరింది. మానకొండూర్ మండలం పచ్చునూర్కు చెందిన ఆయన 30 ఏండ్ల కింద వైద్య వృత్తిని ప్రారంభించారు. తిమ్మాపూర్ మండలం జడ్పీటీసీగా పని చేశారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదటి సారి 2009లో పోటీచేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీ నుచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై 30వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ అనురాధ దంపతులకు కూతు రు, కొడుకు ఉన్నారు.
చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేడిపల్లి సత్యం మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నా డు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన మేడిపల్లి సత్యం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. 2014లో టీడీపీ నుంచి చొ ప్పదండి అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓటమి చెందాడు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి రెండోసారి ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్పై 37,439 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేడిపల్లి సత్యానికి 90395 ఓట్లు రాగా, సుంకె రవిశంకర్కు 52847, బీజేపీ అభ్యర్థి బొడిగ శోభకు 26,507 ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
హుస్నాబాద్, డిసెంబర్ 3: హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఉత్కంఠ ఓట్ల లెక్కింపులో పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. పొన్నం 2004లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. తర్వాత 2018లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ సారి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప అభ్యర్థి వొడిత సతీష్కుమార్పై 19,344ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.