నాడు సమైక్య పాలనలో వివక్షకు గురైన దివ్యాంగులకు నేడు తెలంగాణ సర్కారు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నది. స్వయం శక్తితో ఎదిగేందుకు సహకారం అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాదు, 500 పింఛన్ను 3వేలకు పెంచి ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నది. మానసిక స్థితితోపాటు చేతులు బాగుండి నడవలేని అసహాయులకు పైసా ఖర్చు లేకుండా బ్యాటరీ ట్రైసైకిళ్లు ఇస్తున్నది. ఉన్నత విద్యనభ్యసించే వారికి ఉచితంగా వాహనాలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు ఇతర పరికరాలను పంపిణీ చేస్తున్నది. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి అందించే ప్రోత్సాహకాన్ని 50వేల నుంచి లక్షకు పెంచి అందించడమే కాదు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వర్తింపజేస్తున్నది. ఇటీవల తెచ్చిన దళితబంధుతో కొత్త వెలుగులు నింపుతూ బతుకులకు భరోసానిస్తున్నది.
– కలెక్టరేట్/కమాన్చౌరస్తా, డిసెంబర్ 2
దివ్యాంగుల చిరకాల కోరిక నెరవేరింది
జగిత్యాల రూరల్, డిసెంబర్ 2 : దివ్యాంగుల చిరకాల కోరిక నేరివరిందని, దివ్యాంగుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో దివ్యాంగుల శాఖ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అనుబంధంగా పనిచేసిందన్నారు. దీనివల్ల వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని గుర్తు చేశారు.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకుని, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కానుకగా దివ్యాంగులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ముందస్తుగా జీవో నెంబర్ 34ను విడుదల చేశారన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు మూడు శాఖలతో కలిసి సాధికారత శాఖను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన శాఖ నేటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. అనంతరం మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేను దివ్యాంగుల నాయకులు శాలువాతో సత్కరించారు. ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నాయకులు బోగ ప్రవీణ్, దుమాల రాజ్కుమార్, దివ్యాంగుల నాయకులు బండి సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని దివ్యాంగులకు భరోసా దొరికింది. గతంలో నేను ధర్మపురిలో సొంతగా ట్రై సైకిల్ కొనుక్కున్న. ఓ సైకిల్ రిపేర్ షాపులో పనిచేస్తూ బతికేవాడిని. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఇచ్చే 3 వేల పింఛన్ నాకు అందుతున్నది. వాటితో ఇంటి అవసరాలు తీరుతున్నయ్. నాలో పూర్తి ఆత్మవిశ్వాసం పెరిగింది. మంత్రి ఈశ్వర్ సహకారంతో సొంతగా సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకొని సైకిళ్లు రిపేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న. ప్రభుత్వాలు అండగా ఉంటే దివ్యాంగులు వారికున్న దివ్యాంగత్వాన్ని లెక్కచేయకుండా ముందుకుసాగుతరు. దివ్యాంగుల కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన కేసీఆర్ లాంటి నాయకుడి సేవలు దేశం మొత్తానికి అవసరం.
-కొత్తకొండ సతీశ్, దివ్యాంగుడు (ధర్మపురి)
లక్ష విలువైన స్కూటీ ఇచ్చింది
దివ్యాంగుల ఆర్థిక తోడ్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. నాకు రూ.లక్ష విలువైన స్కూటీ ఇచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎంఏ బీఎడ్ చేసిన నాకు స్కూటీని అందించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంట. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ట్రై స్కూటీలను ఇవ్వాలని కోరుకుంటున్న. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పథకాలు అమలు చేయడం దివ్యాంగులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
– చిలువేరి నరేందర్, దివ్యాంగుడు, వెంపల్లి వెంకట్రావ్పేట్ (మల్లాపూర్ మండలం)
విద్యార్థులకు చేయూత
జీవితంలో వెలుగులు నింపే లక్ష్యంతో దివ్యాంగ విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. డిగ్రీ ఆపైన ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగుల్లో కాళ్లు లేకుండా చేతులు బాగా ఉన్న విద్యార్థులకు మోటరైజ్డ్ వెహికిల్స్ అందిస్తున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై అందించినా.. ఇప్పుడు పూర్తి సబ్సిడీపై ఇస్తున్నారు. ఇవే కాకుండా కళ్లు లేని డిగ్రీ ఆపైన విద్యను అభ్యసిస్తున్న వారికి 25 వేల విలువైన ల్యాప్ట్యాప్ను ఉచితంగా అందిస్తున్నారు. మూగ విద్యార్థులకు 4జీ స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నారు. అంధులైన విద్యార్థుల కోసం పాఠాలు రికార్డు చేసుకునే విధంగా డీజే ప్లేయర్స్ ఇస్తున్నారు. ఇక 9వ, 10వ తరగతులు చదువుతున్న అంధ పిల్లలకు ఎంపీ 3 ప్లేయర్లు, కండరాల క్షీణతతో బాధపడుతున్న దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్ పంపిణీ చేస్తున్నారు.
దళితబంధుతో స్వయం ఉపాధి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దివ్యాంగులకు భరోసానిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద తొలివిడుతలో గుర్తించిన అర్హులు 38,640 మంది కాగా, అందులో దళిత దివ్యాంగులు 327 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ఇప్పటికే యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. జగిత్యాలలో ఎనిమింది మంది, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో నలుగురు చొప్పున లబ్ధి పొందారు. ఎలాంటి షరతులూ లేకుండా రూ.10 లక్షలు అందజేస్తుండడంతో నచ్చిన రంగంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. డెయిరీ, మినీ సూపర్బజార్తోపాటు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలానికి చెందిన కొమ్ము సంపత్ ఫొటో స్టూడియో, మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన నర్సయ్య శ్రీలక్ష్మీ నర్సింహస్వామి మినీ సూపర్మార్కెట్, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన సదుల రేణ-తిరుపతి దంపతులు గొర్రెల యూనిట్ పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
పెళ్లి ప్రోత్సాహకం 50 వేల నుంచి లక్షకు
దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే సర్కారు ప్రోత్సాహకం అందిస్తున్నది. 2018 మార్చికి ముందు వరకు 50 వేల ప్రోత్సాహకం మాత్రమే అందించగా, ఆ తర్వాతి నుంచి లక్షకు పెంచి అందిస్తున్నది. గతంలో కేవలం ప్రోత్సాహకం అందించినా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కూడా వర్తింపజేస్తున్నది. దీంతో దివ్యాంగులకు రెండు విధాలా లబ్ధిచేకూరుతున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు అంటే ఈ ఏడేండ్లలో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 78 మందికి 46 లక్షల సాయం చేసింది.
దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట
కోరుట్ల, డిసెంబర్ 2 : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గంలోని ఆరుగురు దివ్యాంగులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రై స్కూటీలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఇప్పటి వరకు సుమారు 68 మందికి స్కూటీలను అందించినట్లు తెలిపారు. ఇంకా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, ఎంపీపీ తోట నారాయణ, టీ(బీ)ఆర్ఎస్ అధ్యక్షుడు తోట నారాయణ, కౌన్సిలర్లు, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఐసీడీఎస్ ప్రతినిధులు తిరుమల దేవి, హేమలత, దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. రుణపడి ఉంటంనేను జిరాక్స్ సెంటర్ నడుపుకుంట కుటుంబాన్ని పోషించుకుంటున్న. అలాంటి నాకు రూ.లక్ష విలువైన స్కూటీని అందించిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. పేద, మధ్య తరగతి కుటుంబాల కలను సాకారం చేస్తున్న సర్కారుకు రుణపడి ఉంటం.
– ఇల్లుటపు నాగరాజు, దివ్యాంగుడు (కోరుట్ల)
కలెక్టరేట్/ కమాన్ చౌరస్తా, డిసెంబర్ 2 : గత ప్రభుత్వాల హయాంలో దివ్యాంగుల గోడు వినేవారు లేరు. కొత్తగా సంక్షేమ పథకాలు తెచ్చింది లేదు. ఉన్న పథకాలను సరిగ్గా అమలు చేసింది లేదు. పెన్షన్ కూడా పెద్దగా ఇచ్చింది లేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాలుగా భరోసానిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విభిన్న సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ స్వయం శక్తితో ఎదిగేందుకు సహకారం అందిస్తున్నది. స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వడమే కాదు, విలువైన ఉపకరణాలను పూర్తి సబ్సిడీపై అందిస్తున్నది. పింఛన్ల మొత్తాన్ని 500 నుంచి 3 వేలకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్లతోపాటు విద్యార్థి దశలో ఉపకార వేతనాలు, ఇంటర్ నుంచి పీజీ దాకా రీయింబర్స్మెంట్, 21 ఏండ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయసు వారికి స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి స్టడీ సరిల్, 50 శాతం రాయితీతో బస్ పాసులు, యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్షను ప్రోత్సాహకంగా అందిస్తున్నది.
సమైక్య రాష్ట్రంలో 500.. స్వరాష్ట్రంలో 3016
నాటి సమైక్య పాలకులు పింఛన్ల మొత్తం పెంపు విషయంలో నిర్లక్ష్యం చూపారు. చంద్రబాబు హయాంలో అన్ని రకాల పింఛన్ల కింద కేవలం నెలకు 75 మాత్రమే ఇచ్చేవారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని కంటి తుడుపుగా పెంచిందే తప్ప ఒక భరోసా ఇవ్వలేదు. నెలవారీగా దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ను 500 చేసినా అవి ఏ మూలకూ సరిపోయేవి కాదు. స్వరాష్ట్రంలో 2014 నుంచి దివ్యాంగుల పింఛన్లను సీఎం కేసీఆర్ 500 నుంచి 1500లకు పెంచారు. తర్వాత 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 1,500 నుంచి 3,016లకు పెంచారు. వీటిని 2019 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు.
ప్రోత్సాహం రూ.లక్షకు పెంపు
దివ్యాంగుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఉదారంగా ఉన్నది. దివ్యాంగులను సకలాంగులు పెండ్లి చేసుకుంటే ప్రోత్సాహకం అందించడంతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం ఇస్తున్నది. గతంలో ప్రోత్సాహకంగా రూ.50 వేలు ఇచ్చేవారు. దాన్ని రూ.లక్షకు పెంచింది. బీపీఎల్లో ఉన్నా లేకున్నా. దివ్యాంగులెవరైనా ఈ ప్రోత్సాహక పథకాన్ని పొందవచ్చు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నా సరే ఈ పథకం వర్తిస్తుంది.
– రవూఫ్ఖాన్, జిల్లా సంక్షేమ అధికారి (పెద్దపల్లి)