రాజన్న సిరిసిల్ల, జనవరి 12(నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని నేషనల్ ప్రొడక్టవిటి కౌన్సిల్ బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ రజినీకాంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో ఐటీఐ విద్యార్థులు, ఎలక్ట్రీషియన్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్, బ్యాటరీలు, సోలార్లను ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. బొగ్గు, పెట్రోలు, డీజిల్పై ఆధారపడకుండా ఉండేందుకు సౌరశక్తి ఎంతో మేలన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించుకోవచ్చన్నారు. విద్యుత్ ఉపకరణాలు కొనుగోలు చేసే విషయంలో స్టార్ రేటింగ్ చూసుకోవాలన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులపై 5స్టార్ నాణ్యత ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యుత్ ఎలా ఆదా చేసుకోవాలో వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఎలక్ట్రీషియన్లకు సూచించారు. సౌరశక్తి వినియోగించుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. పట్టణాల్లో సౌరశక్తి వినియోగం పెరిగిందని తెలిపారు. రైళ్లు, బస్సులు, వివిధ వాహనాలు సైతం సౌరశక్తినే వినియోగిస్తున్నాయన్నారు.
పెట్రోలు, డీజిల్ భవిష్యత్తులో అందుబాటులో ఉండవని, అందుకే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడారు. సోలార్ వినియోగం చాలా మంచిదన్నారు. విద్యుత్ ఆదా చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా సౌరశక్తిపై అవగాహన కల్పించిన ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కరీంనగర్ రెడ్కో అధికారులు లక్ష్మీకాంత్, పరమానంద్, పాముల దేవయ్య, రీసోర్స్పర్సన్ గన్నమనేని శ్రీనివాసరావు, ఎలక్ట్రీషియన్ జిల్లా అధ్యక్షుడు మేర్గు అంజయ్య, ప్రధాన కార్యదర్శి యార సిద్ధిరాములు, ఎలుక కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.