సీఎం కేసీఆర్ దార్శనికతతో పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారిందని, నియోజకవర్గ ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రతీ ఓటరు గుండె గూటిలో చిరకాలం నిలిచి ఉంటాయని చెప్పారు. హ్యాట్రిక్ విజయం సాధిస్తానని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడో సారి టికెట్ ఖరారు కావడంతో మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే..
నమస్తే: మరోసారి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ ఖరారైంది కదా..? ఎలా ఫీలవుతున్నారు?
దాసరి : నాపై నమ్మకం, విశ్వాసం ఉంచి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో మరోసారి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. టికెట్ ఖరారు కావడంతో ఇక పూర్తి స్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యే అవకాశం కలుగుతుంది.
నమస్తే: ప్రచారాన్ని ఎలా ప్రారంభించబోతున్నారు?
దాసరి : పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండుసార్లు పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు లేరు. నాకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు మూడోసారి అవకాశం ఇవ్వబోతున్నారు. మా పార్టీ, మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్నే కాంక్షిస్తుంది. మాకు ప్రచార ఆర్భాటం అవసరం లేదు. మేం ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉన్నాం. మేం చేసిన పనులు నిలిచి ఉంటాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలే మా పార్టీకి ఓటు వేసి గెలిపించి ఆశీర్వదిస్తారు.
నమస్తే: తొమ్మిదిన్నరేళ్లల్లో చేసిన అభివృద్ధి ఏమిటి?
దాసరి : నేను, మా ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లల్లో చేసినంత అభివృద్ధి అసలు పెద్దపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ.. ఎప్పుడూ జరగలేదు. అసలు నియోజకవర్గ ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా పెద్దపల్లి పట్టణాన్ని జిల్లాగా మార్చడంతోనే అభివృద్ధికి పునాదులు పడ్డాయి. వేల కోట్ల రూపాయలతో చారిత్రాత్మక అభివృద్ధి జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి సాధ్యమైంది. ఇది పూర్తిగా సీఎం కేసీఆర్ దార్శనికత దూరదృష్టికి సంకేతం. పెద్దపల్లి నియోజకర్గ ప్రజల అదృష్టం. నియోజకవర్గంలోని 95 శాతం గ్రామాల్లో సీసీ రోడ్లు, 100 శాతం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డులు, శ్మశాన వాటికలు, హరితవనాలు అభివృద్ధి చేశాం. కొన్ని వందల కోట్లతో ఆర్అండ్బీ, గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీని పెంచాం. 200 కోట్లతో పెద్దపల్లి పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశాం. రింగు రోడ్డును తారు రోడ్డుగా మార్చాం. కూనారం ఓదెల గ్రామాల ప్రజల చిరకాల వాంఛ కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి, కూనారం వ్యవసాయ పరిశోధన డిప్లొమా కళాశాల సాధించాం. వరద కాలువ, కాకతీయ కాలువలకు ఎస్సారెస్పీ కాల్వలతో అనుసంధానం చేసి సాగు నీరు అందించాం. కాళేశ్వరం జలాలతో వ్యవసాయ ఉత్పత్తిలో పెద్దపల్లి నియోజకవర్గం టాప్ పొజీషన్లో నిలిచింది. రైతులందరి అవసరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది. నియోజకవర్గంలో అభివృద్ధి చరిత్రను బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖించింది.
నమస్తే: మీ గెలుపునకు ఏయే అంశాలు దోహదపడుతాయనుకుంటున్నారు?
దాసరి : బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ప్రకటన రావడంతోనే నా విజయం ఖరారైంది. నేను, మా ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే నా గెలుపునకు దోహద పడుతాయి. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికీ బీఆర్ఎస్ సర్కార్ మేలు చేసింది. దీంతో ప్రతి ఓటరు గుండెల్లో మా పార్టీ ఉంది. రైతులకు పుష్కలంగా నీళ్లు ఇచ్చింది. వ్యవసాయ ఆధారితమైన నియోజకవర్గంలోని రైతులకు రెండు పంటలకు సాగు నీటిని అందించింది. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, ప్రతీ పేద బిడ్డకు కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్టు, అర్హులైన వారందరికీ పింఛన్లు, దళితులకు దళిత బంధు, బీసీ కుల వృత్తుల వారికి ప్రోత్సాహం, మైనార్టీలకు ఆర్థిక చేయూత, సమాజంలోని అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ అధికారికంగా పండగలను నిర్వహించడం, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం మా గెలుపునకు దోహద పడుతాయి.
నమస్తే: సోషల్ మీడియా విష ప్రచారాలను ఎలా అడ్డుకుంటారు?
దాసరి : కొన్ని పార్టీలు సోషల్ మీడియా వేదికగా బట్టకాల్చి మీద వేయడం నేర్చుకున్నాయి. ఇంత అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంపై, మాపై లేని పోని విమర్శలకు దిగుతున్నాయి. అలాంటి వాటిని సోషల్ మీడియా ద్వారానే తిప్పి కొడుతాం. మాపై జరుగుతున్న విషప్రచారాలను ప్రజలు నమ్మరు, విశ్వసించరు. అభివృద్ధికే పట్టం కడుతారు. ఈ ఎన్నిక కాదు ఏ ఎన్నికైనా పెద్దపల్లిలో బీఆర్ఎస్ దే గెలుపు.
నమస్తే: ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొడుతారు?
దాసరి : రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రతి పక్షాల తీరు హాస్యాస్పదం. వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారు చేసే కుహనా విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు. వారు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ తెలంగాణలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం లేదు. ఇది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వారి విమర్శలను తిప్పి కొట్టడం కాదు. పట్టించుకోకుండా ఉండడమే మంచిది.
నమస్తే: చివరగా ప్రజలకు మీరిచ్చే సందేశం?
దాసరి : ప్రజలు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో గ్రహించాలి. ఎవరు అభివృద్ధి చేస్తారు. ఎవరు మాయ మాటలు చెబుతారో గమనించాలి. గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేల హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలి. బీఆర్ఎస్ సర్కార్ చేసింది, చేస్తున్నదీ చూసి ఓటేయాలి. మాయ మాటలు విని మోసపోవద్దు. అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టం కట్టాలి. మూడోసారి కేసీఆర్ను సీఎంను చేయాలి.