Peddapally | కమాన్ పూర్, జూన్ 30 : పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్ ను మరోమారు నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేస్తానని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి ఐక్యత, అభివృద్ధి కోసం సమిష్టిగా పని చేస్తామని తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో మరోమారు తనకు జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వచర్ల శ్రీను, జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ దాసరి ఉషకు, అలాగే సహకరించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.