చొప్పదండి, మార్చి 23: చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డు అందుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ్వర్యంలో రూ. 65 లక్షలతో నిర్మించిన వెయ్యి మెట్రిక్ టన్నుల ఎరువుల గోదాంను గురువారం ఆయన నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతు కుటుంబాలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని, ఆ దిశగా ఆయన చేపట్టే పథకాలు ఉన్నాయన్నారు. కేంద్రం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తే దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో రైతులకు క్షమాపణ చెప్పిన చరిత్ర ప్రధాని మోదీకే చెల్లుతుందని ఆరోపించారు. వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతుల వద్దకు సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి ఓదార్చుతున్నారని కొనియాడారు. సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ రైతులకు సేవలందించడంతో పాటు వంద శాతం రుణాలను రికవరీ చేసి, సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలోని ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధికి సహకారం అందించాలని కొండూరి రవీందర్రావును ఎమ్మెల్యే కోరారు.
అనంతరం కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ, జిల్లాలోని ఏ ప్లస్ సహకార సంఘాల్లో చొప్పదండి సంఘం ఉండడం అభినందనీయమని కొనియాడారు. సంఘం పరిధిలోని రైతులు సీఎం కేసీఆర్ సూచన మేరకు అంతర్గత పంటలు పండిస్తూ లాభాలు ఆర్జించడం హర్షణీయమన్నారు. కరీంనగర్ సహకార బ్యాంక్ ద్వారా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం రూ. 300 కోట్ల ఎల్టీ రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సంఘం పరిధిలోని రైతుల పిల్లలు 500 మందికి ఉన్నత చదువుల కోసం రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. చొప్పదండి సహకార సంఘం రూ.45 కోట్ల టర్నోవర్తో నడుస్తున్నదని చెప్పారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని చైర్మన్ వెల్మ మల్లారెడ్డి కోరగా, తక్కువ వడ్డీతో మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న పెట్రోల్ బంక్ నిర్వహణ ఇబ్బందిగా ఉందని చైర్మన్ విన్నవించగా, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రవీందర్రావు భరోసా ఇచ్చారు. అనంతరం 13 మంది పేద విద్యార్థులకు రూ.5 వేల చొప్పున నగదు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, కేడీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ముద్దం మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, నాబార్డు డీడీఎం అనంతరావు, తహసీల్దార్ రజిత, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, గుంట రవి, సురేశ్, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, జిల్లా సభ్యుడు మచ్చ రమేశ్, బీఆర్ఎస్ నాయకులు వెల్మ శ్రీనివాస్రెడ్డి, లోక రాజేశ్వర్రెడ్డి, మాచర్ల వినయ్, నలుమాచు రామకృష్ణ, ఏనుగు స్వామిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, ఏనుగు మల్లారెడ్డి, సహకార సంఘం కార్యదర్శి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.