Veenavanka | వీణవంక, ఆగస్టు 11 : తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్, దేవేందర్ కోరారు. వీణవంక మండలంలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్ మంగళవారం విలేకరులతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. పొలం సాగుచేసుకుందామంటే తన తమ్ముడు రవి కరెంట్ డబ్బా ఫ్యూజ్లు తీసి, వైర్లు కట్ చేస్తున్నాడని, దీంతో ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నీరులేక నారుమడి ఎండిపోతోందని, నారుపోసి రెండు నెలలు గడుస్తున్నా సాగుకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎస్ఐ ఆవుల తిరుపతిని వివరణ కోరగా భూ తగాదాలు సివిల్ మ్యాటర్ అయినందున జోక్యం చేసుకోలేదని తెలిపారు. కరంట్ డబ్బాలో వైర్లు కట్ చేశారనే ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.