వేములవాడ, ఫిబ్రవరి 25: మల్కపేట రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల పనులు పూర్తిచేసి సాధ్యమైనంత తొందరలో సాగునీరందించాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ఆదివారం వేములవాడలోని భీమేశ్వర గెస్ట్హౌస్ క్యాంపు ఆఫీసులో జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈలు గంగం శ్రీనివాస్రెడ్డి, అమరేందర్రెడ్డితో ప్రాజెక్టుల పనులపై సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో ఎస్సారార్ నుంచి అప్పర్ మానేరు వరకు గల పెండింగ్ పనులు, మల్కపేట రిజర్వాయర్ కాల్వల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సీఎం రేవంత్తో చర్చించి నిధుల విడుదలకు కృషి చేస్తానని చెప్పారు.
ఈ పనులు పూర్తయితే 20 నుంచి 30 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నిమ్మపల్లి నుంచి వేములవాడ వరకు గల మూలవాగుపై నిర్మించిన చెక్డ్యాంల మరమ్మతును యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. మల్లారం ఆనకట్ట నుంచి గుడి చెరువుకు వచ్చే కట్టు కాలువ బుడగజంగాల కాలనీ వద్ద కాలువను నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఈఈలు శ్రీనివాస్రెడ్డి, అమరేందర్రెడ్డి, డీఈలు ప్రశాంత్కుమార్, శ్రీనివాస్, రవికుమార్, సత్యనారయణ, వినోద్కుమార్, క్రాంతికుమార్, సురేశ్, కిషోర్, ఏఈలు నవీన్కుమార్, శ్రీనివాస్, సాగర్, రాజు రమేశ్ ఉన్నారు.