రాయికల్, జనవరి 13: మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలందిస్తున్నది. ఫలితంగా ప్రసూతి వైద్యంపై నమ్మకం పెరిగి గర్భిణులు క్యూ కడుతున్నారు. రాయికల్ మండ లం ఒడ్డెలింగాపూర్ ఎంపీటీసీ స్వప్న శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవం చేయించుకున్నారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి, ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంచారు.
ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఎంసీహెచ్కు వెళ్లి స్వప్నను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయంగా చిన్నారిని ఎత్తుకున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. మహిళలు స్వప్నను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ దవాఖానలకు రావాలని సూచించారు. అనంతరం ఎంపీటీసీకి సీఎం కేసీఆర్ కిట్ను అందజేశారు. ఇక్కడ డాక్టర్ శశికాంత్రెడ్డి, లచ్చనాయక్ తండా సర్పంచ్ శ్రీలత శ్రీనివాస్, నందు నాయక్, రాయికల్ మండల అధికార ప్రతినిధి హరీశ్రావు, నాయకులు లక్ష్మీపతిరావు ఉన్నారు.