కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో ఈ ప్రక్రియ ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తుండగా.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు 28 నుంచి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీల వారీగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగనున్నది. కొత్త నిబంధనల ప్రకారం చూస్తే ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు, ఎనిమిదేళ్లు దాటిన ఇతర ఉపాధ్యాయులకు నిర్బంధ బదిలీలు ఉంటాయి. దీంతోపాటు అర్హత ఉన్న ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా అంచనాల ప్రకారం.. కొత్త నిబంధనల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలో బదిలీలకు సంబంధించి 7 వేల వరకు దరఖాస్తులు రావచ్చని తెలుస్తున్నది. అందులో 5 నుంచి 6వేల వరకు బదిలీలు జరిగే అవకాశముంటుంది. అలాగే పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి 11 నుంచి 1200 వరకు ఉంటాయని చెబుతున్నారు. నిజానికి 2015 జూలైలో చివరి సారిగా పదోన్నతులు, బదిలీలు ఒకేసారి నిర్వహించారు. 2018లో కేవలం బదిలీలు మాత్రమే చేపట్టారు. 2015 తర్వాత తిరిగి ఇప్పుడే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను రెండింటిని కలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారు.
గతంలో ఉపాధ్యాయ బదిలీలు అన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో జరిగేవి. దీంతో ఉపాధ్యాయ సంఘాల జోక్యం ఉండేది. అలాగే.. వెకెన్సీల వివరాలు చెప్పినప్పుడు రకరకాల గొడవలు జరిగేవి. పేరుకు మాత్రమే కౌన్సెలింగ్ అన్న రీతిలో జరిగేవి. అంగబలం, అర్థబలం ఉన్న వాళ్లదే పై చేయిగా ఉండేది. ఉపాధ్యాయ సంఘాల మధ్య మనస్పర్థలు కూడా పొడచూపేవి. అనేకసార్లు ఉపాధ్యాయ సంఘాలు కౌన్సెలింగ్ను బహిష్కరించేవి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర విద్యాశాఖ ఈ సారి కూడా పకడ్బందీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దరఖాస్తు చేయడం, ఆప్షన్లు ఇచ్చుకునే వరకు మాత్రమే ఉపాధ్యాయుల బాధ్యత ఉంటుంది. ఆ తదుపరి అంతా ఆన్లైన్లో పని జరుగుతుంది. సంబంధిత ఆర్డర్ను నేరుగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో బదిలీ ఉత్తర్వుల కోసం విద్యాశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేసే ఇబ్బందులు తప్పనున్నాయి.
ఆన్లైన్ ప్రక్రియలో బదిలీలు జరగనుండగా ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందోనన్న చర్చ జోరుగా నడుస్తున్నది. ఇద్దరు ఉపాధ్యాయులు కలిసిన ప్రతి చోటా బదిలీలు, పదోన్నతులపై మాట్లాడుకోవడం కనిపిస్తున్నది. మొత్తం మీద చూస్తే వేలాది మందికి స్థాన చలనం మాత్రం తప్పదని స్పష్టమవుతున్నది. నిజానికి ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన అవకాశం వల్ల ఉపాధ్యాయుల కల కూడా సాకారం కానున్నది. ఈ అవకాశం కోసం గతంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయసంఘాలు నాయకులు సైతం ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తులు చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ అవకాశం కల్పించడంపై చాలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలు ప్రకటించేందుకు అన్ని జిల్లాలో విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేస్తున్నది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకునేందుకు ప్రత్యేక అధికారులను సైతం నియమించింది.