ఆలోచన ఉండాలేగానీ, వాడిపాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎంచక్కా వ్యాపారం చేయొచ్చు! మరో నలుగురికి ఉపాధి చూపవచ్చు! అందుకు వేములవాడ పట్టణానికి చెందిన జలగం హన్మంతరావే మంచి ఉదాహరణ! వాడిపారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో బిజినెస్ చేస్తున్న ఆయన, నెలలో 7లక్షలకు పైగా వ్యాపారం చేసి, మంచి లాభాలు ఆర్జించాడు. తాను సంపాదించడమే కాదు, మరో నలుగురికి ఉపాధి చూపుతున్నాడు.
-వేములవాడ, డిసెంబర్ 10
వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వేలాదిగా తాకిడి ఉంటుంది. అయితే ఇదే సమయంలో ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తున్నది. భక్తులతోపాటు పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్, కూల్డ్రింక్ బాటిళ్లను ఉపయోగించిన తర్వాత పారేస్తుండగా, పట్టణానికి చెందిన జలగం హన్మంతరావు ఓ ఆలోచన తట్టింది. వాడిపారేసిన ప్లాస్టిక్తో వ్యాపారం చేయాలని అనుకున్నాడు. అందుకోసం నెలన్నర క్రితం పట్టణంలో 5లక్షలతో ప్రెస్సింగ్ యూనిట్ను ఏర్పాటు చేశాడు.
ప్లాస్టిక్ వ్యర్థాలను కిలోకు 20 నుంచి 25 వరకు పైగా చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు. ఇలా రోజువారీగా సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లను రంగుల వారీగా వేరుచేసేందుకు ఆరుగురు కూలీలను నియమించుకున్నాడు. ఒక్కొక్కరికీ రోజుకు 500 కూలీ ఇస్తున్నాడు. వేరు చేసిన వాటిని ప్రెస్సింగ్ మిషన్తో బెండల్గా మారుస్తున్నాడు. ఒక్కో బెండల్ వంద నుంచి 140కిలోల వరకు బరువు కలిగి ఉంటున్నది. తర్వాత ఆ బెండళ్లను గుజరాత్, హైదరాబాద్కు తరలిస్తున్నాడు. క్వింటాల్కు 3500 చొప్పున నెలలో 20టన్నుల మేర ఎగుమతి చేశాడు. మొత్తంగా 7లక్షల వ్యాపారం చేయగా, లక్షకుపైగా లాభం పొందాడు.
ఈ ప్లాస్టిక్ను ఆయా రాష్ర్టాల్లో రీసైక్లింగ్ చేసి బాటిళ్లు తయారు చేస్తారని హన్మంతరావు చెబుతున్నాడు. అయితే క్వింటాల్ ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవని, మార్కెట్కు అనుగుణంగా మారుతాయని వివరించాడు. ఇప్పటికే లాభాలు మంచిగున్నాయని, మరో నలుగురికి ఉపాధినివ్వడం సంతోషంగా ఉందన్నాడు. సుమారు 20మంది వరకు ప్లాస్టిక్ సేకరణ చేస్తున్నారని, ఒక్కొక్కరు నిత్యం 200కుపైనే సంపాదిస్తున్నారని చెప్పాడు.