కరీంనగర్, జూలై 26 (నమస్తే తెలంగాణ):వాన ముసిరింది. చినుకుచినుకూ తోడై కుండపోత పోస్తున్నది. వారం రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా, ఉమ్మడి జిల్లా జలమయమైంది. ముఖ్యంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము దాకా దంచి కొట్టగా, జనజీవనం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లి, మెజార్టీ కాలనీల్లోకి వరద పోటెత్తింది. అటు గోదారి, మూలవాగు, ఇటు మానేరు, మోయతుమ్మెద పొంగిపొర్లుతుండగా, జల వనరుల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరుతున్నది. పాల్వంచ, కూడెల్లి ఉధృతితో నర్మాల ఎగువ మానేరు పూర్తిగా నిండుకొని మత్తడి దుంకుతుండగా, మధ్య, దిగువ మానేరు జలాశయాలకు వరద భారీగా వస్తున్నది. అటు పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి రిజర్వాయర్కు ఇన్ఫ్లో పెరుగుతుండగా, జిల్లాల యంత్రాంగం రంగంలోకి దిగి, పరీవాహక ప్రజలను అప్రమత్తం చేస్తున్నది.
వాన వదలడం లేదు. తెరిపిలేకుండా కురుస్తుండడంతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అనేక చెరువులు మత్తళ్లు పడుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు, కుంటలు, నీటితో నిండుకుండల్లా మారాయి. మరో పక్క గోదారి, మానేరు, మూలవాగు, మోయతుమ్మెద వాగు, చిలుక వాగు, శంకరపట్నం వాగులు పొంగుతున్నాయి. గంగాధర మండలం గట్టుభూత్కూర్ చెరువుకు బుంగ పడడం మినహా ఎక్కడా ఏ చెరువు దెబ్బతిన లేదు. భారీ వర్షాలు కురుస్తున్నా చెరువుల్లోకి భారీగా వరద చేరుతున్నా చిన్న నీటి వనరులు తట్టుకుని నిలబడుతున్నాయి.
ప్రాజెక్టులకు భారీగా వరద
భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద పోటెత్తుతున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు, మంథని మండలం సిరిపురం పార్వతీ బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి 59,504క్యూసెక్కుల వరద వస్తుండడంతో రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఇరిగేషన్ అధికారులు 8 గేట్లను ఎత్తి 59,176 క్యూసెక్కుల నీటిని దిగువన గల పార్వతీ బరాజ్లోకి వదులుతున్నారు. ఇక్కడా వరద పోటెత్తడంతో బరాజ్ 40గేట్లు ఎత్తి 78,429 క్యూసెక్కుల నీటిని సరస్వతీ బరాజ్కు వదులుతున్నారు. ఇక గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకుతున్నది. మెదక్జిల్లా కూడెల్లి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చే పాల్వంచ వాగుల నుంచి 2వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు నిండి మత్తడి దూకుతూ అంతే మొత్తం మధ్యమానేరుకు వెళ్తున్నది. ఇక వేములవాడ మూలవాగు, సిరిసిల్ల మానేరు వాగుల నుంచి మధ్యమానేరులోకి 9వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలు ఇలాగే దంచి కొడితే ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశమున్నది. ప్రస్తుతం ఎస్సారార్లో 16.46 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 1530 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
పొంగుతున్న మోయతుమ్మెద
కరీంనగర్ జిల్లాలోని ప్రధాన వాగుల్లో ఒకటైన మోయతుమ్మెద పొంగుతున్నది. ఈ వాగు ద్వారా ఎల్ఎండీ జలాశయంలోకి 7,620 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. చిగురుమామిడి మండలం ఇందుర్తి, ఒగులాపూర్ మధ్యన ఎల్లమ్మవాగు పొంగుతున్న నేపథ్యంలో ఈ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగు నుంచి వచ్చే వరద మోయతుమ్మెదలో కలుస్తున్నది. గంగాధర మండలంలోని వెంకటయ్యపల్లి వాగు పొంగుతుండగా, నారాయణపూర్ రిజర్వాయర్లోకి భారీగా వరద వస్తున్నది. ఫలితంగా మత్తడి దుంకుతున్నది. శంకరపట్నంలోని కేశవపట్నం వాగు పారుతుండగా కల్వల ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరి, మత్తడి దుంకుతున్నది.