ఎల్లారెడ్డిపేట, జనవరి 14 : ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వందేళ్ల చరిత్ర ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం రాకముందే నిజాంకాలంలో రూపుదిద్దుకున్నది. వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దింది. అయితే కాలక్రమేణా పాఠశాల శిథిలావస్థకు చేరింది. పై పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో భవనాన్ని పరిశీలించిన ఇంజినీర్లు కూల్చివేత తప్పదని హెచ్చరించారు. అయితే ఆ అందమైన బడి ఇక కూలిపోతుందేమోనని అనేక మంది పూర్వ విద్యార్థులు ఆందోళన చెందారు. వేల మందికి బతుకు బాటను చూపిన తమ పాఠశాల శిథిలమై కూల్చివేస్తారని తెలిసి పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ఫొటోలు, సెల్ఫీలు దిగి ఉద్వేగానికి లోనయ్యారు. అయితే వందేళ్ల చరిత్ర గల, ఎందరో మందికి మధుర జ్ఞాపకంగా నిలిచిన పాఠశాలను భావితరాలు గుర్తుంచుకునేలా అదే అర్కిటెక్చర్ విధానంలో నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ అప్పటికే హామీ ఇచ్చారు.
అదే ఏడాది ఏప్రిల్లో కూల్చి వేయగా, అమాత్యుడు ఇచ్చిన మాట ప్రకారం పూర్వపు పాఠశాల నమూనాలో కొత్తబడిని నిర్మించారు. ‘మన ఊరు – మన బడి’ కింద సీఎస్ఆర్ నిధులు 7.5కోట్లతో స్కూల్ను శరవేగంగా పూర్తి చేశారు. గివ్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ కొండూరి సాకేత్ పర్యవేక్షణలో సకల హంగులతో కార్పొరేట్కు దీటుగా నూతన బడి నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. 400 మంది ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ హాల్ కూడా పూర్తయింది. 48 కంప్యూటర్లతో విద్యను అందించేందుకు ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. తుది మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఇచ్చిన మాట ప్రకారం నిజాం కాలంనాటి పెద్దబడి నమూనాలో కొత్త సొబగులద్దుకుని కళ్లముందు కనిపిస్తుంటే గ్రామస్తుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.