Yellareddypet school | ఎల్లారెడ్డిపేట, జూన్ 17 : ఏండ్ల తరబడిగా ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న ఎల్లారెడ్డిపేట పెద్ద బడి భవనం శిథిలమవడంతో దాని స్థానంలో సరికొత్త భవనాన్ని నిర్మించారు. పూర్వ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ సకల వసతులతో కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గత సంవత్సరం ఏప్రిల్ 23న గివ్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి కొండూరు సాంకేత్రావు ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయించారు. ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన ఈ పాఠశాలలో అంగన్వాడీ స్థాయి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకునేలా అద్భుత సముదాయాన్ని నిర్మించారు. 8.50 కోట్లతో పూర్తయిన పాఠశాలలో సకల వసతులు కల్పించారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు క్రీడామైదానం, గ్రంథాలయం, ప్రయోగశాలలు నిర్మించారు. కాగా, ఈ నెల 20న విద్యా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సకల వసతులు
పాఠశాలలో 48 కంప్యూటర్లతో మోడల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. 400 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేందుకు అనువైన డైనింగ్ హాల్ నిర్మించారు. బాలురు, బాలికలు, సిబ్బందికి వేరువేరు టాయిలెట్లు, కిచెన్షెడ్లు, ఫిల్టర్ వాటర్ ప్లాండ్లు, డిజిటల్ బోర్డులు, రన్నింగ్ వాటర్, హ్యాండ్వాష్ సౌకర్యం కల్పించారు. ఫిజికల్, బయోసైన్స్ ల్యాబ్లు ఇదివరకే ఉన్నప్పటికీ మరిన్ని వనరులు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
పెరుగుతున్న అడ్మిషన్లు
అద్భుతమైన పాఠశాల భవనం, నిపుణులైన బోధన, బోధనేతర సిబ్బంది, ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రుల్లో నమ్మకం ఏర్పడడంతో తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పక్క మండలాల నుంచి కూడా వస్తున్నారు. రెండు రోజుల నుంచి ఉన్నత పాఠశాలలో 80, ప్రాథమిక పాఠశాలలో 40 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
భావి తరాలు గుర్తుంచునేలా..
మేం ఇదే పాఠశాలలో చదువుకున్నం. తాటాకు గుడిసెల్లో, చెట్ల కింద క్లాసులు విన్నం. చేతి పంపు నీళ్లు తాగినం. పెద్దబడి కూల్చినప్పుడు చాలా బాధపడ్డం. అలాంటి బడిని మళ్లీ చూడగలమా అనుకున్న. కానీ, మంత్రి కేటీఆర్ ఒక మంచి పాఠశాలను భావితరాలు గుర్తుంచుకునేలా నిర్మించుకుందామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లు అన్ని వసతులతో అద్భుతంగా నిర్మించారు. పాఠశాల ప్రారంభానికి పూర్వ విద్యార్థులందరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డిపేట
అడ్మిషన్లు పెరుగుతున్నాయి..
పాఠశాలను అన్ని రకాల వసతులతో నిర్మించారు. మొన్న ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో 10 జీపీఏ సాధించాం. పాఠశాల పరిసరాలు, ఫలితాలను చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకూ అడ్మిషన్లు పెరిగిపోతున్నాయి.
– దబ్బెడ హన్మాండ్లు, హెచ్ఎం, ఎల్లారెడ్డిపేట స్కూల్.