జగిత్యాల కలెక్టరేట్/అర్బన్, నవంబర్ 28: ‘కాంగ్రెస్ నాయకులు దొంగ బాండ్ పేపర్లతో వస్తున్నరు. నమ్మితే మోసపోయి గోసపడుతం. జీవన్రెడ్డి నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే బాండ్ పేపర్ రాసిచ్చే పరిస్థితి వచ్చేదా ..?’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత మంగళవారం జగిత్యాల పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చివరికి చేరుకున్నామని, కానీ ఇది విజయానికి తొలి మెట్టు అన్నారు. జగిత్యాలలో తొలిసారి గులాబీ జెండా ఎగురవేసింది డాక్టర్ సంజయ్కుమార్ అని, గతంలో వచ్చిన 60వేల మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో రెండో సారి గెలిపించుకోవాలన్నారు.
జగిత్యాలను జిల్లాగా చేశామని, బీర్పూర్ను మండలంగా, రాయికల్ను మున్సిపల్గా చేశామన్నారు. జిల్లా అయిన తర్వాత జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని, ఇండ్లు లేని పేదలు ఉండవద్దనే ఉద్దేశ్యంతో జగిత్యాల పట్టణానికి 4500 ఇండ్లు మంజూరు చేసి, చాలా మట్టుకు పంపిణీ కూడా చేశామన్నారు. మరో రెండు వేల ఇండ్లు కావాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కోరారని, త్వరలోనే 2వేల ఇండ్లు సైతం మంజూరు చేస్తామన్నారు. గడిచిన ఐదేండ్లలో ప్రజలు కోరినవన్నీ చేశామన్నారు. 50ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ నాయకుడైన జీవన్రెడ్డి ఏం పరిపాలన చేయలేదని, నేడు బాండ్ పేపర్ రాసి, దేవుని ముందు పెట్టి వస్తున్నాడని, ఇంత కన్నా దారుణమైన విషయం మరోటి ఉండదన్నారు. నిజంగా ప్రజలకు సేవ చేసిఉంటే, ప్రజలు కోరిన ప్రకారం పనిచేసి ఉంటే, ప్రజల కోసమే పనిచేసుంటే జీవన్రెడ్డి బాండ్ పేపర్ రాసే అవసరం ఉండదన్నారు. నేటి వరకు అనేక కార్యక్రమాలు చేశామన్నారు.
ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ను రెండో సారి గెలిపించిన తర్వాత తొలి ప్రాధాన్యతగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని, ఆ తర్వాత ఎలాంటి కటాఫ్, పీఎఫ్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులకు రూ.3వేల పెన్షన్ను అందిస్తామన్నారు. అలాగే ఏ ఆధారం లేని వారికి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పేరుతో రూ.5లక్షల ఉచిత బీమా కల్పిస్తామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 15లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని, రైతు బంధును రూ.16వేలకు పెంచుతామని, ఎన్నారై పాలసీని ఏర్పాటు చేస్తామని, గల్ఫ్ కార్మికులకు సైతం రూ.5లక్షల బీమా కల్పిస్తామన్నారు. ఆసరా పెన్షన్ను రూ.5వేలకు, దివ్యాంగుల పెన్షన్ను రూ.6వేలకు పెంచుతామన్నారు. రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందిస్తామన్నారు. ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాలు మొదలు కొని పెట్రోల్ దాకా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచని రంగంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించినన్ని పన్నులు బ్రిటిషర్లు సైతం విధించలేదన్నారు.
ఇష్టారీతిన పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించి రూ.400కే అందిస్తామన్నారు. బాగా చదువుకొని, రాజకీయాల్లో బాగా సీనియార్టీ ఉన్న జీవన్రెడ్డి సులభంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మాట్లాడితే రాష్ట్రంలో ఉద్యోగాలియ్యలేదనే కాంగ్రెస్ నాయకులకు ‘నేను సవాల్ విసురుతున్న. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.32లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. వీటిలో 1.60లక్ష ఉద్యోగాలను భర్తీ చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ ప్రభుత్వం కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటా’ అని సవాల్ చేశారు. ఈ సవాల్ను రాహుల్గాంధీ స్వీకరించాలని, రుజువు చేయని పక్షంలో రాజకీయాల్లోంచి తప్పుకోవాలన్నారు. ఇక్కడి మాదిరిగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 223 మంది కాంగ్రెస్ అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసిచ్చి మరిచిపోయారన్నారు.
మన కంటే పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో 2.60లక్షల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయని, నెల రోజుల్లో భర్తీ చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆరు నెలలు గడుస్తున్నా కనీసం ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను కూడా ప్రారంభించలేదని, ఇక్కడేమో పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని 50ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మనకు కనీసం మంచినీళ్లు కూడా పూర్థి స్థాయిలో ఇయ్యలేదన్నారు. జీవన్రెడ్డి మన ఇంటికి వచ్చి మనం పోసే చాయ్ తాగి.. మన బువ్వ తిని పోతడు తప్పితే, పైసా పని చేయడన్నారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న డాక్టర్ సంజయ్కుమార్ను గెలిపించాలన్నారు.
నిరంతరం పేదల గురించి, రైతుల గురించి బడుగు బలహీన వర్గాల బాగు కోసం తపించే కల్పవృక్షం లాంటి కేసీఆర్ కావాలా..? తులసీవనంలో గంజాయిలాంటి రేవంత్రెడ్డి, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ కావాలా..? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి గతంలో మన ఉద్యమకారులపై తుపాకీపట్టుకొని వచ్చాడని, మన ఉస్మానియా విద్యార్థులను అడ్డాకూలీలు అంటూ అవమానపరుస్తున్నాడని, మూడు గంటల కరంటు.. 10హెచ్పీ మోటార్లంటూ, అసలుదారులకు, కౌలుదారులకు డబ్బులిస్తానని రేటెంత రెడ్డి మాట్లాడుతున్నాడని, అతనికి ఎడ్లు తెలువదు.. ఎవుసం గురించి తెలియదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సీఎం కుర్చీ కోసం కొట్లాటకే సమయం చాలదని, ప్రజలు ఆగం కావాల్సి వస్తదని, కాంగ్రెస్ పాలనలో కరంటు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు, అభివృద్ధి, సంక్షేమం ఏదీ ఉండదన్నారు. అబద్ధాలే అలవాటు ఉన్న జీవన్రెడ్డి మనం ఎప్పుడో రద్దు చేసిన మాస్టర్ ప్లాన్ గురించి దుష్ప్రచారం చేస్తున్నాడని, జగిత్యాల ప్రజల అభీష్టం మేరకే మాస్టర్ ప్లాన్ను రూపకల్పన చేస్తామన్నారు. అల్లీపూర్ను మండలంగా చేస్తామన్నారు. బీసీ బంధును పెంచుతామని, దళిత బంధును కొనసాగిస్తామని, కొత్తగా గిరిజన బంధును సైతం తెస్తామని వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాజేశంగౌడ్, జడ్పీ చైర్పర్సన్ వసంత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్ పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో గులాబీ దండు మంగళవారం కదంతొక్కింది. అసెంబ్లీ ఎన్నికల చివరి రోజున జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత రోడ్షో తీయగా, జగిత్యాల టవర్ నుంచి మొదలైన రోడ్ షో నాయుడు చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ దాకా కొనసాగింది. టవర్ నుంచి పాత బస్టాండ్ దాకా రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చింది. ఎమ్మెల్సీలు కవిత, ఎల్ రమణ, ఎమ్మెల్యే డా సంజయ్కుమార్పై పూలు, గులాబీ రంగు కాగితాలు చల్లుతూ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తన ప్రసంగంతో ఆకట్టుకోగా, జనం చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. భారీగా వచ్చిన ముస్లిం మైనార్టీలనుద్దేశించి ఎమ్మెల్సీ కవిత, ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, ఎమ్మెల్సీ కవిత సహకారంతో జగిత్యాల నియోజకర్గాన్ని రూ.4వేల కోట్లతో అన్ని రంగా ల్లో అభివృద్ధి చేశా. 40 ఏండ్లు ప్రజాజీవితంలో ఉండి ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించిన జీవన్రెడ్డి జగిత్యాలకు చేసిందేమీ లేకపోగా, సానుభూతి కోసం పరితపిస్తున్నడు. అభివృద్ధి ముం దు సానుభూతి పనిచేయదు. 2004 నుచి 2014 దాకా జగిత్యాలకు ఎన్ని నిధులు తెచ్చాడో..? ఏం అభివృద్ధి చేశాడో జీవన్రెడ్డి చెప్పాలి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలే కుటుంబంగా భావించి పనిచేస్తుంటే, కొన్ని పార్టీలు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నయి. అది సరికాదు.
– డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల అభ్యరి
రోడ్షోకు వచ్చిన జనాన్ని చూస్తుంటే జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ఖాయమని స్పష్టమైంది. ఇదే ఊపుతో ఈ నెల 30న కారు గుర్తుపై ఓట్లు గుద్దాలి. జగిత్యాలలో కారు స్పీడును ఎవరూ ఆపలేరు. డాక్టర్ సంజయ్ సీటుతోపాటు జిల్లాలోని మిగతా నాలుగు సీట్లను గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తాం. దండుగుమారి, దగాకోరు కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే మోసపోతరు. బీజేపీ నాయకులు బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దు.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ