కరీంనగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం వీణవంక మండలంలో మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజక వర్గంలో ప్రతి గ్రామానికి కోటి రూపాయల నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారన్నారు. మరో రెండు నెలల్లో సొంత భూమి ఉన్న వాళ్లకు ఇండ్లు నిర్మించుకోవడానికి మూడు లక్షలు ఇస్తామన్నారు. అలాగే దళిత బంధు ఇచ్చిన విధంగా అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు.
గత సంవత్సర కాలంగా ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఇప్పటి వరకు ఎవర్ని పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో సీఏం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుందని ఆయన తెలిపారు.