బహిరంగ చర్చల్లో ముఖ్యనేతలు మాత్రమే పాల్గొంటారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం ‘చలో హుజూరాబాద్’ పేరిట వేలాది మంది రావాలని ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ ఈ నెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గానీ, ఒక్క జీవో గానీ ఇవ్వలేదంటూ ఈటల చేసిన విమర్శలను ఆయన అదే రోజు తిప్పికొట్టారు. హుజూరాబాద్ ప్రగతికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్లు, నిధుల వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. అంతేకాదు, ‘నీవు చెప్పింది నిజమైతే.. ఆరోపణలు నిరూపించే దమ్ముంటే.. నీవు ఏం చేశావో.. సీఎం కేసీఆర్ ఏం చేశారో.. అలాగే ప్రభుత్వం ఎన్ని నిధులను ఇచ్చిందో ఈ నెల 5న హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ప్రజల ముందు తేల్చుకుందాం రా..’ అంటూ ఈటలకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో చర్చకు వస్తారా? లేదా? అన్న విషయంపై స్పష్టతనివ్వని రాజేందర్, గడిచిన 24 గంటలుగా బీజేపీ శ్రేణులను మాత్రం ఉసిగొల్పుతున్నట్లు తెలుస్తున్నది. చర్చా వేదిక వద్దకు వేలాది మంది తరలిరావాలంటూ.. ‘జై బీజేపీ.. జై ఈటల’ పేరిట సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతుండడం వెనుక ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం కనిపిస్తున్నది. లోతుగా చూస్తే మళ్లీ ఏదో అలజడి సృష్టించి సింపతీ పొందడంతోపాటు చర్చను పక్కదారి పట్టించేందుకు బీజేపీ శ్రేణులు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘బీజేపీ ద్రోహుల పార్టీ. దేశాన్ని మతం కులం పేరుతో విభజిస్తూ, విచ్ఛిన్నం చేస్తున్న పార్టీ. నిలువెల్లా విషం నింపుకున్న కాషాయ పార్టీ. నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న పార్టీ. కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీలు వేసిన కమలం పార్టీ’ అంటూ గతంలో తూర్పార పట్టిన ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు అదే పార్టీలో చేరి మాట మార్చిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీయే దేశానికి దిక్సూచి అని, తెలంగాణ పథకాలు కేంద్రం కాపీ కొడుతున్నదని, ముఖ్యమంతి కేసీఆర్ లాంటి మహా నాయకుడు లేడంటూ ఆనాడు చెప్పిన ఆయన ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రంలో ప్రళయం సృష్టించి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలో రాకుండా చూసేందుకే.. తనకు ఓ బాధ్యత అప్పగించారం టూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు, తాను గజ్వేల్ నుంచి కేసీఆర్పై పోటీ చేస్తానని ముందు చెప్పి.. హుజూరాబాద్ నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు హుజూరాబాద్ నుంచైనా సరే అంటూ మాట మార్చారు. ఏ ఎండకాగొడుగు పట్టడంలో ఆయనకు ఆయనే సాటి అనే విమర్శలు ఎదుర్కొంటున్న రాజేందర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన తొమ్మిది నెలలైనా ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. పైగా ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు మళ్లీ పాత పద్ధతిలోనే ఆరోపణలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.
సవాల్పై స్పష్టత కరువు
గత నెల 30న హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన రాజేందర్, విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. నిజానికి ఉప ఎన్నికల్లో రాజేందర్ 20 హామీలు ఇచ్చారు. వాటిని మేనిఫెస్టోలో పెట్టి.. ఇంటింటా కరపత్రాలు పంచి పెట్టారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అమలు చేస్తామని చెప్పారు. అందులో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అంతేకాదు, అమలు కోసం ప్రయ త్నం చేసిన దాఖలాలు లేవు. దీంతో ఈటల తీరు పై స్థానికంగా అసంతృప్తి పెరగడమే కాదు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వంపై విమర్శలు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హుజూరాబాద్ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉప ఎన్నిక తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కపైసా గానీ, ఒక్క జీవో గానీ ఇవ్వలేదని, ఇచ్చినట్లుగా ఆధారాలుంటే చూపమంటూ విమర్శలకు దిగారు. తాను గతంలో తెచ్చిన నిధులకు పేరు మార్చి కొత్తగా శిలాఫలకాలు వేసుకుంటున్నారని మరో కామెంట్ చేశారు. ఇవేకాకుం డా.. తన హక్కులకు భంగం కలుగుతుందంటూ మళ్లీ సెంటిమెంట్ మాటలు మాట్లాడారు. తాను హుజూరాబాద్లో ఎంతో అభివృద్ధి చేశానని, మిగతా నియోజకవర్గాలతో పోల్చుకొని చూడండి అంటూ పేర్కొన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమని, తమ ప్రభుత్వంలో హుజూరాబాద్ 100 ఏండ్లకు సరిపడే అభివృద్ధి చేసి చూపిస్తానంటూ మాటలు చెప్పారు. ఈ మాటలతోపాటు రాజేందర్ చేసిన ఆరోపణలను స్థానిక టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు.
రాజేందర్ ప్రెస్మీట్ పెట్టిన రోజే అంటే గత నెల 30న సాయంత్రం కౌశిక్రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్లు, కేటాయించిన నిధుల వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. అంతే కాదు, హుజూరాబాద్ నియోజవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చేశారో.. పూర్తి వివరాలు వెల్లడించారు. ఈటల ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని భావించిన కౌశిక్రెడ్డి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అదే విలేకరుల సమావేశంలో రాజేందర్కు సవాల్ విసిరారు. ‘హుజూరాబాద్ అభివృద్ధికి నీవు ఏం చేశావో.. ముఖ్యమంత్రి ఏమి చేశారో తేల్చుకోవడంతోపాటు ఉప ఎన్నిక తర్వాత నీవు ఏం చేశావో.. ప్రభుత్వం ఏమి చేసిందో.. ప్రజల సమక్షంలో తేల్చుకోవడానికి ముందుకు రావాలి’ అంటూ ఈటలకు సవాల్ విసిరారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వేదికగా ఈ నెల 5న ఉదయం 11 గంటలకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, దమ్ముంటే.. చేసిన ఆరోపణలు నిజమని నిరూపించే సత్తా ఉంటే.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరేమి చేశారో చర్చించడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇక్కడితో ఆగిపోని.. కౌశిక్ దాదాపు ఆరోజు నుంచి నేటి వరకు ప్రతి రోజూ సవాల్ను రిపీట్ చేస్తూ వస్తున్నారు. అంతేకాదు చర్చకు రావాలంటూ నియోజకవర్గంలోని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఈటల చెప్పిన అబద్ధాలు.. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు, నిధులను ప్రజల సాక్షిగా తేల్చడానికి కౌశిక్రెడ్డి సిద్ధమయ్యారు. నేడు హుజూరాబాద్ చౌరస్తాలో బహిరంగ చర్చలో ప్రజల ముందు వాస్తవాలు వెల్లడించడానికి కావాల్సిన వివరాలతో ఆయన సన్నద్ధయ్యారు. దీంతో పాటు అభివృద్ధిలో ఇతర నియోజకవర్గాలతో పోల్చి చూసుకోవాలన్న ఈటల పేర్కొనడంపై కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు.
‘కేసీఆర్తో పోటీ పడుతానని చెబుతున్నావే.. గజ్వేల్లో జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగిందా.. లేదా? సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగినట్లు చేశావా? కరీంనగర్లో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారు.. అలా ఎందుకు చేయలేక పోయారు? ఖమ్మంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి జరిగింది. మీరు ఎందుకు చేయలేక పోయారో చెబుతారా..? ఈ విషయాలను కూడా బహిరంగ చర్చలో మీరు వెల్లడించాలి’ అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేరికల కమిటీకి చైర్మన్గా రాజేందర్ను బీజేపీ నియమించిందని, అంటే ‘ఆ పార్టీ ఈ పార్టీతో మాట్లాడి నాయకులను తెచ్చి బీజేపీలో కలుపుకునే పని అది. అందుకే ఢిల్లీలో బ్రోకర్’ అనే పదాన్ని తాను వినియోగిస్తున్నట్లుగా చెప్పారు.
శ్రేణులను ఉసిగొల్పి..
ఎమ్మెల్సీ విసిరిన సవాలును స్వీకరించి చర్చకు వస్తారా.. లేదా? అన్నదానిపై రాజేందర్ ఇప్పటి వరకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. నేటి వరకు ఆ విషయంలో స్పష్టత లేదు. కానీ, గడిచిన 24 గంటల నుంచి బీజేపీ మాత్రం ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఆ మేరకు రాజేందర్ తరఫున బహిరంగ చర్చా వేదిక వద్దకు వేలాది మంది తరలిరావాలంటూ.. ‘జై బీజేపీ.. జై ఈటల’ పేరిట సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు. అంతే కాదు, కౌశిక్రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చోటనే.. బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారు.
చర్చకు రమ్మన్నది రాజేందర్ను అయితే.. అక్కడికి వేలాది మంది తరలిరావాలని ఎందుకు పిలుపునిస్తున్నట్లు అన్నదానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా లోతుగా చూస్తే.. మళ్లీ ఏదో అలజడి సృష్టించి సింపతి పొందడంతోపాటు చర్చను పక్కదారి పట్టించేందుకు బీజేపీ శ్రేణులు పక్కాగా ప్లాన్ చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. నిజంగా అభివృద్ధిపై చర్చించాలంటే.. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే రావాలే కానీ, వేలాది మంది పార్టీ శ్రేణులు అక్కడికి రావాలంటూ సోషల్మీడియాలో విస్తృత ప్రచారం చేయడం వెనుక అబద్ధపు మాటల భయం దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటన్నింటినీ లెక్కచేయకుండా నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి మాత్రం సిద్ధమయ్యారు.