ధర్మపురి/ధర్మపురి రూరల్, నవంబర్19: ‘బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్ది అధికారం దక్కించుకుని తెలంగాణను అధోగతి పాలు చేసే అహంకారం. అధికారం శాశ్వతం కాదు. బంధమే శాశ్వతం. తెలంగాణ కోసం కొట్లాడిన నాడు, అధికారం లేనినాడు ప్రజల పక్షాన పోరాడినం. అధికారం ఉన్న నాడు ప్రజల కోసమే పని చేస్తున్నం’ అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ధర్మపురి క్షేత్రంలోని బ్రాహ్మణ సంఘ భవనంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతకాని, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మహిళలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్కు పెట్టే గుణం లేదని, అధికార కాంక్ష మాత్రమే ఉందని, ఎన్నికల సమయంలో మాత్రమే ఆ పార్టీకి ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు.
అది చేస్తాం, ఇది ఇస్తాం.’ అని ఝూటా మాటలు చెప్పి పోతారని, ప్రజలకు ఏమీ చేయరని మండిపడ్డారు. కాంగ్రెస్కు యాభై ఐదేండ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. వారి హయాంలో పింఛన్ 200మాత్రమే ఇచ్చారన్నారు. కొత్త పింఛన్ కావాలంటే పాత పింఛన్దారుడు ఒకరు పోతే ఇచ్చేటువంటి దుస్థితి, దుఃఖం ఉండేడిదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు పైసా కూడా ఇవ్వలేదన్నారు. నేటి బీఆర్ఎస్ పాలనలో హనుమంతుని గుడి లేని ఊరు లేదని, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ను 5వేలకు పెంచుకుంటాని, ఎన్నికల పూర్తయిన వెంటనే రూ.3వేలు అవుతుందని, తర్వాత ఏటేటా 500 పెంచుతూ 5వేలు చేస్తామన్నారు. కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా, పీఎఫ్ కార్డు ఉన్నాలేకున్నా బీడీ కార్మికులందరికీ 5వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు.
సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు 3వేల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, దాంతో రాష్ట్రంలో రేషన్ కార్డులు కోటికి చేరుతాయన్నారు. కేసీఆర్ మ్యానిఫెస్టో అంటే అన్ని వర్గాలకు భరోసా అని, కేసీఆర్ బీమా కింద ప్రతి ఒక్కరికి 5లక్షల బీమా వర్తింపజేస్తామని చెప్పారు. రేషన్ కార్డు మీద సన్నబియ్యం సరాఫరా చేస్తామన్నారు. కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం కింద 15లక్షల ఆరోగ్య బీమా పరిమితిని పెంచుతామన్నారు. అలాగే అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒక హాస్టల్ నిర్మిస్తామన్నారు. ఇంకా సొంత స్థలం ఉన్నపేదవారికి ఇండ్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం 3లక్షల అందజేస్తున్నామని, ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే 4వేల మందికి ఇచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి ఇండ్లు కట్టడమో..? డబ్బులు ఇవ్వడమో చేస్తామన్నారు. వచ్చే రానున్న ఎన్నికల్లో యువత ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ సునీల్కుమార్, కౌన్సిలర్లు ఉన్నారు.
పదేండ్ల కిందటి వరకు కరెంటు ఉంటే వార్త. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త. నాడు రాత్రి పూట కరెంటుతో రైతులు అరిగోస పడ్డరు. పాముకాటుకు, తేలుకాటుకు గురై ఎందరో రైతులు ప్రాణాలు చనిపోయిన్రు. రాత్రిపూట చేనుకాడికి పోయేందుకు రైతులు దుబాయ్ నుంచి టార్చ్లైట్లు తెప్పించుకునేటోళ్లు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు మంచిరోజులచ్చినయి. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం ఒక పండుగ అయింది. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శగా నిలిచిన సంగతి అందరికీ తెలుసు. గత పాలకుల పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు గుర్తు చేసుకోవాలి. ఈ నెల 30న పొద్దన్నే నిద్రలేచి మొదట దేవుడికి దండం పెట్టి ఇంట్లో ఉన్న స్విచ్ ఆన్ చేయాలి. కరెంటు బుగ్గ వెలిగితేనే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలి. లేకుంటే లేదు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
పధ్నాలుగేండ్లుగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఒక పంట పొలంలా కాపాడుకుంటూ వచ్చిన. ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్న. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలతో వస్తున్నయి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆగమైతం. ప్రజలు బాగా ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలి. పేదల సంక్షేమం కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలి. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నం. మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే స్కీంలతో మ్యానిఫెస్టో తయారు చేసినం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పాత కథే అయితది. వారి పాలనలో పడ్డ కరెంటు కష్టాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ముక్కిపోయిన మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా..? 24గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? ఆలోచించుకోండి. గతంలో రైతుల దగ్గర పన్నులు వసూలు చేపిన చరిత్ర కాంగ్రెస్దైతే, ఇప్పుడు రైతులకే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ది.
– ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్