అసెంబ్లీ ఎన్నికల వేళ కుల మతాలకతీతంగా మంత్రి కేటీఆర్కు జైకొడుతున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో కులవృత్తులకు జీవం పోయడం, అన్ని వర్గాలకు ప్రోత్సాహం అందించినందుకు కృతజ్ఞతగా మద్దతు తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో రజకులంతా రామన్న వెంటే ఉంటారని, కారు గుర్తుకే ఓటేసి లక్షకు పైగా మెజార్టీ అందిస్తామని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు.
ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్తో కలిసి సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మద్దతు ప్రకటించారు. తమకు గూడునిచ్చిన రామన్నకే తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెలోని కేసీఆర్నగర్ వాసులు (డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో న్యాయవాదులు సమావేశమై, కేటీఆర్కు మద్దతు తెలిపారు.
నా అనుభవంల ఎన్నో గవర్నమెంట్లు, ముఖ్యమంత్రులను చూసిన. ఎన్నికలు రాంగనే మేం ఉన్నదగ్గరికి వచ్చి ‘మీకు గిది చేస్తాం.. గది చేస్తాం’ అని మాటలు చెప్పి ఓట్లేయించుకునుడే తప్ప మళ్ల కనిపించింది లేదు. కానీ, తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ సార్ చెప్పిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నడు. యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు 300 పింఛన్ ఇత్తె అవి ఎటూ సాలకపోతుండె.
అందుకే కేసీఆర్ సారు మా పింఛన్ పెంచిండు. నెలకు 4,016 ఇస్తుండు. మాకు ఆత్మగౌరవం కల్పించిండు. గిసోంటి కేసీఆర్ సారు పది కాలాలపాటు ముఖ్యమంత్రిగా ఉంటే నాలాంటి ఎంతోమందికి ఆసరైతడు. కేటీఆర్ సార్ మా ఊరును మంచిగ చేసిండు. అన్ని సౌలత్లు చేసిండు. సిరిసిల్లను బాగా మంచిగ చేసిండు. గింత అభివృద్ధి చేసిన నాయకుడిని కాదని వేరెటోళ్లకు ఓటు వేస్తే అది నా తప్పేఅయితది. ఓటు విషయంలో వేరే ఆలోచనే లేదు. ఎంత మంది వచ్చినా కేటీఆర్ సారునే గెలిపించుకుంటం.
– దుర్గవేని ఎల్లయ్య యాదవ్,
సిరిసిల్ల టౌన్, నవంబర్ 8: రజకులంతా యువ సారథి, అమాత్యుడు రామన్న వెంటే ఉంటారని, ఈ ఎన్నికల్లో మా సంపూర్ణ మద్దతు ఆయనకేనని.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రకటించారు. జిల్లా సిరిసిల్ల కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. రజకుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. వీర వనిత చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని 80వేల కనెక్షన్ల (లాండ్రీ దుకాణాల)కు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని గుర్తు చేశారు.
141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మోడ్రన్ దోభీఘాట్లను మంజూరు చేసి, రజకవృత్తికి ఆధునిక సొబగులు కల్పించారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 102జీవో ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. రజకులతో పాటు నాయీబ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడంతో రాష్ట్రంలోని 80వేల రజక కుటుంబాలు, 40వేల నాయీబ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. మనకు మంచిచేస్తున్న కేసీఆర్కు మనమంతా మద్దతు తెలుపడంలో తప్పులేదన్నారు. అనంతరం రజకుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన కరపత్రాలను జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సమావేశంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేశ్, పట్టణాధ్యక్షుడు దండు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కాసర్ల మహేందర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విక్రం, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాసర్ల పద్మ, తదితరులు పాల్గొన్నారు.