పెద్దపల్లి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఇప్పటికే రెండింటిని అమలు చేశామని, మరో పది పదిహేను రోజుల్లో మరో రెండు అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయనకు జిల్లా సరిహద్దు గ్రామమైన సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో తమపై పూర్తి నమ్మకం, విశ్వాసంతో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని, తమ వెంటన నడిచిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సైతం నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలు అండగా నిలిచి పెద్దపల్లి ఎంపీని గెలిపించి, భారత ప్రధానిగా రాహుల్గాంధీని చేసుకోవాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డికి జిల్లాపై పూర్తి పట్టు ఉందని, ఆయన సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రధానంగా కోరుతున్న విధంగా పెద్దపల్లి, సుల్తానాబాద్కు బైపాస్ రోడ్లతోపాటు బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు పవర్హౌజ్, బైపాస్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
మంథని నియోజకవర్గ అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉండబోతోందన్నారు. రామగుండంలోని సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీలకు అనుబంధ పరిశ్రమలను మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామికంగా మరింత అభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శశిభూషణ్ కాచె, సూర సమ్మయ్య, ఉప్పు రాజు, పులిపాక శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, నూగిళ్ల మల్లయ్య, కొండి సతీశ్, తదితరులు పాల్గొన్నారు.