కోరుట్ల, డిసెంబర్ 18 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సోమవారం ‘గుడ్ మార్నింగ్ కోరుట్ల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉదయం ప్రజా ప్రతినిదులు, మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలోని 20వ వార్డులో పర్యటించారు. చింతల వాడ, బీసీ కాలనీ, అయ్యప్పగుట్ట కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారి చికిత్సకు సంబంధించిన ఎక్స్రే పత్రాలు, మందుల చీటీలు పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత త్వరగా పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను, వాగ్దానాలను నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని అభయమిచ్చారు. ప్రతిరోజూ ఉదయం వేళలో గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కాగా, కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పరిషరించాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఉదయం వేళ ఇంటికి వచ్చిన సంజయ్కి మహిళలు, అయ్యప్ప దీక్ష స్వాములు సాదర స్వాగతం పలికి తిలకం దిద్దారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, కౌన్సిలర్లు గంధం గంగాధర్, పేర్ల సత్యం, మోర్తాడు లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు బింగి సంతోష్, సత్యనారాయణ, ఆనంద్, ప్రభు పాల్గొన్నారు.