తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 18: ‘పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి సాధిస్తున్నది.’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతున్నదని చెప్పారు. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉన్నది? ప్రజలు నెమరేసుకోవాలని సూచించారు. తిమ్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందించారు. అలాగే శ్రీ సత్యసాయి సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్ఎండీ జడ్పీ స్కూల్లో విద్యార్థులకు రాగి జావను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో మనకు పాలన చేతకాదన్నవారే ఇప్పుడు ఇక్కడి అభివృద్ధిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. 24 గంటల నిరంతర కరెంట్ ఇవ్వడం ఎలా సాధ్యమైందని అడుగుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ఇతర దేశాలతో పోటీ పడుతుందని చెప్పారు. మిషన్ కాకతీయ కింద 44 వేల చెరువులు, కుంటల మరమ్మతు, ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భంలో 630 టీఎంసీల నీరు ఉన్నదని, మరో మూడేళ్లు వర్షాలు లేకున్నా ఢోకా లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇసున్నదని, అందుకే గురుకులాలు, జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 6694డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, 5వేల ఇండ్లకు టెండర్లు పూర్తికాగా, 3వేల ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత విద్యుత్, పింఛన్లు, కాళేశ్వరం లాంటి పథకాలు ఎందుకు లేవని? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వీటిపై సమాధానం చెప్పాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు రానివారు అసంతృప్తికి గురికావద్దని, సొంత జాగా ఉన్నవారికి డబ్బులు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. దేశంలో ఇండ్లు లేనివారు ఎందరో ఉన్నారని, ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్రూం పథకం ద్వారా పేదలకు ఇండ్లను అందజేయడం హర్షణీయమని కలెక్టర్ అన్నారు. సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వ ఆశయం గొప్పదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్కుమార్, తహసీల్దార్ కనుకయ్య, ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంపీటీసీ వేల్పుల మమత పాల్గొన్నారు.
సకల వసతులతో ఇండ్లు
తిమ్మాపూర్లో సకల వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినం. వినోద్కుమార్ సహకారంతో నియోజకవర్గంలో తొలిసారిగా ప్రారంభించినం. ప్రస్తుతం 50 మంది లబ్ధిదారులకు ఇచ్చినం. రానివారు ఆందోళన చెందవద్దు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం నగదు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నం. ఒక్కొక్క పువ్వు పేర్చి బతుకమ్మను అందంగా తీర్చిదిద్దినట్లు ఇండ్లను నిర్మించినం. లబ్ధిదారులు అందరూ ఒక్కతాటిపై ఉంటేనే సమస్యలుండవు. ఇండ్ల పంపిణీ పండుగలా అనిపిస్తున్నది. లబ్ధిదారుల కండ్లలో ఆనందం సంతృపిస్తున్నది.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే