మానకొండూర్, నవంబర్ 9 : మానకొండూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు అంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీవైస్ చైర్మన్ సిద్ధం వేణు, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, వేగురుపల్లి మాజీ సర్పంచ్ ముద్దసాని శ్రీధర్రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి లక్ష్మీకిరణ్కు అందజేశారు. అనంతరం విలేకరులతో రసమయి మాట్లాడారు. సీఎం కేసీఅర్ తనపై నమ్మకంతో మూడు సార్లు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, ఇప్పుడు వారి దీవెనలతో హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవ్గంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని ధీమావ్యక్తం చేశారు.