హుజూరాబాద్/ వీణవంక, జనవరి 18: ‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఉన్న కోపాన్ని రైతులపై చూపద్దు. సాగుకు కరెంట్, నీళ్లు ఇవ్వకుండా గోస పెట్టడం తగదు’ అని కాంగ్రెస్ నేతలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హితవు పలికారు. పదేండ్లు రందిలేకుండా పంటలు పండించుకున్న రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెలకే నీళ్ల కోసం వాగుల్లో బావులు తవ్వుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘మార్పు రావాలి.. మార్పు తేవాలి’ అంటూ ఎన్నికల ముందర ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు తెచ్చిన మార్పు ఇదేనా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్, వీణవంకలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పంటలకు సాగునీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ ఏఈతో మాట్లాడానని చెప్పారు. నీళ్లు విడుదల చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
తమ ప్రభుత్వం రాగానే రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు ఇస్తామని, వెంటనే రుణమాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం అందించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై సైతం మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 18 వేల కుటుంబాలకు దళితబంధు మంజూరు చేసిందని గుర్తు చేశారు. మొదటి విడుత నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, ప్రస్తుతం వారంతా రెండో విడుత కోసం ఎదురుచూస్తున్నారన్నారు. వెంటనే నగదు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, వైస్ ఎంపీపీపీ రాయిశెట్టి లత, సర్పంచ్ నీల కుమారస్వామి పాల్గొన్నారు.