వీణవంక, జనవరి 31: గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దేశాయిపల్లి గ్రామంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జీపీల నిర్మాణం కోసం ప్రతి గ్రామానికీ రూ.20 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు.
సర్పంచుల పదవీ కాలం ముగిసే సమయంలో వారిని గౌరవించాలనే ఉద్దేశంతోనే నూతన జీపీ భవనాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 106 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. సర్పంచుల పదవీకాలం కరోనా సమయంలోనే రెండేళ్లు గడిచిపోయిందని, వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి పదవీ కాలాన్ని పొడిగించాలని కోరారు.
200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారు బిల్లులు కట్టవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, సర్పంచ్ గాలేటి జ్యోతి-సురేందర్రెడ్డి, ఉపసర్పంచ్ నల్ల తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు సంపత్రెడ్డి, దాగు అశోక్రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.