మల్యాల, జనవరి 6 : ఎస్సారెస్పీ ప్రాజెక్టును నుంచి వరద కాలువకు శనివారం అధికారులు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండలంలోని రాంపూర్ పంప్హౌస్-1లోని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరదకాలువలో 0.2 టీఎంసీల నీరుందని, అధికారులు 2000 క్యూసెకులు విడుదల చేశారని, కాలువలో నీళ్లు నింపడంతో పాటు తూముల ద్వారా ఆయకట్టుకు అందిస్తామన్నారు.
అనంతరం పంప్హౌస్ నమూనా, పనితీరును అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. వరదకాలువకు మోటర్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదని, ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని నూకపల్లికి చెందిన రైతులు ఎమ్మెల్యేకు విన్నవించగా ఎస్ఈతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ డీఈఈ తిరుపతి, ఏఈఈలు రాజశేఖర్, నాయకులు పుల్కం నర్సయ్య, దారం ఆదిరెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.