కోనరావుపేట, నవంబర్ 4: ‘ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ఆగంకావద్దు. బీజేపీ, కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదు. ఆ రెండు పార్టీలు దొందుదొందే. కోట్లాడి సాధించుకున్న రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష’ అని వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పష్టం చేశారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి, వెంకట్రావుపేట, శివంగాళపల్లి, ఏగ్లాస్పూర్, కోనరావుపేట గ్రామాల్లో శనివారం జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. కారు గుర్తుకే ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరుతున్నాయని గుర్తు చేశారు. మన రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదన్నా రు.
సాగు, తాగునీరందిస్తూ కష్టాలను తీర్చారన్నారు. ఇప్పటికే కోనరావుపేటలోని మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. అక్కడి నుంచి మూలవాగు జీవనదిగా మారడానికి 166కోట్లతో నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టుకు లిప్ట్ పనులు పూర్తయినట్లు చెప్పారు.
ఈ పనులన్నీ మీ కండ్ల ముందే కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్లో కూడా ఇలాంటి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. కంటితడిపెడుతూ.. కళ్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను నమ్మితే గోసపడుతామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి పనులు చేసేందుకు మల్కపేట బిడ్డగా మీ వెంటే ఉంటానని మాటఇచ్చారు.
కేసీఆర్ సర్కారుకు ఓటు వేస్తామని మహిళలు, కులసంఘాల సభ్యులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. నిమ్మపల్లి, గొల్లపల్లి గ్రామస్తులు ‘మా మద్దుతు చల్మెడకే’ అంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. వెంకట్రావుపేటలో గౌడ, రజక సంఘాల నాయకులు తమ ఓటు కారు గుర్తుకేనంటూ స్పష్టం చేశారు. అలాగే వెంకట్రావుపేటలో పల్లం లక్ష్మణ్ ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబ సభ్యుల ను చల్మెడ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మార్క్ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ సంకినేని రామ్మోహన్రావు, మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గోగు ప్రతాపరెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, సర్పంచులు మంతెన సంతోష్, కదిరె శ్రీనివాస్, శివంగాళ ఎల్లయ్య, దండు ఎల్లవ్వ, పోకల రేఖ, ఆరె లత, రాములునాయక్, ఎంపీటీసీ గోగు భారత, యువజన విభాగం మండలాధ్యక్షుడు ముష్నం జీవన్గౌడ్, ఉపసర్పంచులు దొంతరవేని శ్రీనివాస్, దండు శ్రీనివాస్, సీనియర్ నేత న్యాలకొండ రాఘవరెడ్డి, గ్రామాధ్యక్షుడు తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.