కార్పొరేషన్, ఫిబ్రవరి 28: త్యాగానికి మారుపేరు సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని సప్తగిరికాలనీలో గల సేవాలాల్ మందిరంలో బుధవారం సేవాలాల్ జయంత్యుత్సవాలు నిర్వహించారు. కాగా, సేవాలాల్ చిత్రపటానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సేవాలాల్ జీవితచరిత్రను భావితరాలకు అందించాలన్నారు. నగరంలో సేవాలాల్ మందిరం, భవన నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, ఎంపీటీసీ తిరుపతినాయక్, ఉత్సవ కమిటీ నాయకులు లక్పతి, భాస్కర్, డీటీ నాయక్, భీమా సాహెబ్, తిరుపతి, రాజు, రవి, సంతోష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.