కార్పొరేషన్, మార్చి 24: వేసవి కాలంలో నగరంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలను మాజీ ఎంపీ వినోద్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానకొండూర్తో పాటు నగరం చుట్టు పక్కల గ్రామాలకు తాగునీరు అందించే మానేరు డ్యాంలో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మార్చిలో నీటి నిల్వలు ఇంతలా పడిపోవడం చూడలేదన్నారు.
ప్రస్తుతం ఎల్ఎండీలో 5.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండీ ద్వారా తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే దిగువకు సాగునీరు అందించాలని జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం ఎల్ఎండీలో 13 టీఎంసీలు, మధ్యమానేరులో 6.5 టీఎంసీల నిల్వలు తగ్గకుండా చూశామని తెలిపారు. తాము తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చామని, తర్వాత పంటలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మధ్య మానేరు, ఎల్ఎండీ నీటితో నిండుకుండల్లా ఉండేవని గుర్తు చేశారు. నగరంలో ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేయడంతోపాటు 24 గంటల పాటు నిరంతరం సరఫరా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో మండు టెండల్లో కూడా చెరువులు మత్తడి దుంకాయని చెప్పారు. నేడు ఎల్ఎండీలో నీటి నిల్వలు పడిపోవడంతో నగరంలోని బోరింగ్లు కూడా పని చేయడం లేదన్నారు. ఇప్పటికే నగరంలో నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయని, ఎల్ఎండీలో నీటి నిల్వ పడిపోవడం వల్ల బూస్టర్ పంపుల ద్వారా నీటిని అందించడం సాధ్యపడడం లేదని తెలిపారు.
మహిళలు మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లపైకి వచ్చే పరిస్థితి తేవద్దని ప్రభుత్వానికి సూచించారు. జిల్లాకు చెందిన మంత్రులు, సీఎం వెంటనే స్పందించి ఎల్ఎండీ నుంచి దిగువకు నీటి విడుదలను నిలుపుదల చేయించాలన్నారు. డ్యాంలో ప్రస్తుతం ఉన్న ఐదు టీఎంసీలకు మరో రెండు టీఎంసీలను మధ్యమానేరు నుంచి విడుదల చేస్తే కరీంనగర్లో ప్రజలకు రోజూ గంట పాటు తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.