కొత్తపల్లి, మార్చి 30 : ఉపాధి హామీ పథకంలో కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఫలితాల్లో ముందంజలో నిలిచింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది కూలీలకు పని కల్పించడంతోపాటు నాణ్యతగా పనులు చేపట్టినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంక్లను విడుదల చేసింది.
రాష్ట్రంలో కొత్తపల్లి మండలం ఫస్ట్ ర్యాంకును, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలం రెండో ర్యాంక్ను కైవసం చేసుకోగా, వికారాబాద్ జిల్లా బంతారం మండలం మూడో స్థానం, వికారాబాద్ మండలం నాలుగో స్థానం, కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం ఐదో స్థానంలో నిలిచాయి. కాగా, రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధనకు కృషిచేసిన ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్గౌడ్, వైస్ ఎంపీపీ భూక్య తిరుపతినాయక్, ప్రజా ప్రతినిధులు, అధికారులను శనివారం కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభినందించారు. కొత్తపల్లి మండలం ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.