కొత్తగా కొలువుదీరిన మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు మళ్లీ కీలక పదవులు దక్కాయి. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును ఐటీశాఖ, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ను బీసీ సంక్షేమ శాఖ వరించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రెండు శాఖలను కేటీఆర్, గంగుల కమలాకర్కు ఇవ్వగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మన ఉమ్మడి జిల్లాకు చెందిన వారికే కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులైన దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు మంత్రి వర్గంలో చోటు లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలొజీ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన శ్రీధర్బాబుకు ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో కీలమైన ఐటీ శాఖతో పాటు ఆయన గతంలో నిర్వహించిన శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖను ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ ఈ పోర్ట్ పోలియోను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐటీ విస్తరణకు విశేష కృషి చేశారు. ఇప్పుడు ఇదే ఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఈ అవకాశం రావడం విశేషం. ఇక మరో కీలక నేత పొన్నం ప్రభాకర్కు రవాణా శాఖతోపాటు బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు. పార్లమెంట్ సభ్యుడిగా పలు పదవుల్లో అనుభవం ఉన్న ఆయన, ఉమ్మడి జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖను సమర్థవంతంగా నిర్వహించారు.
గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. ఐటీ విస్తరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ శాఖను నిర్వహించిన కేటీఆర్ హైదరాబాద్లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పడంలో కృతార్థులయ్యారు. ఇప్పుడు ఇదే శాఖను శ్రీధర్బాబుకు అప్పగించడం రాష్ట్రంలో కరీంనగర్కు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నది.
బడుగు బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిలో జిల్లా నుంచి గంగుల కమలాకర్ పాలు పంచుకోగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్కు ఇదే శాఖను ఇచ్చింది. గతంలో ఈ పదవులు నిర్వహించిన ఇద్దరు జిల్లా నేతల స్థానంలో ప్రభుత్వం మారినా మరో ఇద్దరు కీలక నాయకులకు ఇవే పదవులు రావడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది.