జగిత్యాల రూరల్, మే 4 : తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామ రక్ష అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 64 మంది ఆడబిడ్డలకు 64 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులను మోతె రోడ్డులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, షీ టీమ్స్, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలు చేపట్టి మహిళలకు అండగా నిలుస్తున్నాదన్నారు. అంగన్ వాడీ, ఆశా కార్యకర్తల జీతాలు పెంచిన సరార్ కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటు పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగకరంగా మారిందని, రెండో సంవత్సరం వైద్య విద్యకు అనుమతి వచ్చిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 12 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్నదని, కేంద్రం వాటా శూన్యమన్నారు. దాదాపు 60 సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మహిళల కోసం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మహేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెరుకు జాన్, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, రైతు బందు మండల కన్వీనర్ నకల రవీందర్ రెడ్డి, తహసీల్దార్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.