జగిత్యాల, డిసెంబర్ 10: కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో మహాలక్ష్మి పథకం, ఆరోగ్య శ్రీ పథకంలో రూ.10 లక్షల దాకా ఉచిత ఆరోగ్య చికిత్స కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆస్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందచేయడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు.
ఆరోగ్యశ్రీలో చికిత్సలను బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచితే, నేటి కొత్త ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచడం ఆనందదాయకమన్నారు. మరికొన్ని రోగాలను ఇంకా ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పేదలకు మరింత ఉపయోగంగా ఉంటుందన్నారు. అయితే మహాలక్ష్మి పథకం వల్ల మహిళలందరికీ మేలు జరుగడం లేదని, బస్సు సౌకర్యం లేని గ్రామాలకు వెంటనే బస్సులు నడిపించాలని కోరారు.
గత బీఆర్ఎస్ సరారు హయాంలో మహిళల కోసం న్యూట్రిషన్ కిట్లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు జీతాల పెంపు, బాలికల గురుకుల ఏర్పాటు, జగిత్యాలలో ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీడీ పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, పాత ప్రభుత్వంలో విద్యవైద్యానికి పెద్ద పీట వేసినట్లు గుర్తు చేశారు.
అంగన్వాడీ, ఆశ కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిషారానికి కృషి చేస్తామని, ఆటో యూనియన్ కార్మికుల సమస్యల పరిషారానికి కృషి చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని, వారికి రూ.15 వేల జీవన భృతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని ఆకాంక్షించారు. ఇక్కడ డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ జైపాల్ రెడ్డి, డిపో మేనేజర్ జీ సునీత, స్థానిక కౌన్సిలర్లు దాసరి లావణ్య ప్రవీణ్, జ్యోతి లక్ష్మణ్, జిల్లా అధికారులు సాయి బాబా, నరేష్, కమిషనర్ అనిల్, కౌన్సిలర్లు ఉన్నారు.