సారంగాపూర్, జనవరి 24: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్పై కాంగ్రెస్ సర్కారు రాద్ధాంతం చేస్తున్నదని ఆక్షేపించారు. ఓర్వలేకే చిన్నచిన్న లోపాలను పెద్దవిగా చూపుతూ బీఆర్ఎస్పై బురదజల్లే యత్నం చేస్తున్నదని మండిపడ్డారు. షట్టర్ల నిర్మాణం మినహా రోళ్లవాగు ఆధునీకరణ పనులను పూర్తిచేశామని పేర్కొన్నారు.
గత వానకాలం భారీ వర్షాలకు దెబ్బతిన్న కొల్వాయి, మంగెళ, రేకులపల్లి, కమ్మునూర్ లిఫ్ట్ మరమ్మతు పనులను 3 కోట్లతో పూర్తిచేశామని చెప్పారు. 84 ట్రాన్స్ఫార్మర్లు, 800 స్తంభాలను తిరిగి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 70 లక్షలతో పూర్తి చేసిన మంగెళ లిఫ్ట్ను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. రోళ్లవాగు సాగు విస్తీర్ణాన్ని 25 వేలకు పెంచామన్నారు. 150 మీటర్లు ఉన్న కట్టను 3వేల మీటర్లకు విస్తరించామన్నారు.
ప్రాజెక్టు నిర్వాసితులకు 16 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. ప్రాజెక్ట్లో గేట్ల బిగింపు, అటవీ అనుమతులు తీసుకోవడం మిగిలిందన్నారు. దీనిపై ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. కేంద్ర జలసంఘం అనుమతుల మేరకే కాళేశ్వరం నిర్మించారన్నారు. మేడిగడ్డ వద్ద 86వ గేట్ కొంత మేర దెబ్బతింటే ప్రాజెక్ట్ మొత్తమే పనికిరాదని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికైనా సత్వరమే మరమ్మతు చేపట్టి రైతులకు నీరందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ డైరెక్టర్ ముపస్పాల రాంచందర్రావు, నాయకులు కొల్ముల రమణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నారపాక రమేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్ల మైపాల్రెడ్డి, సర్పంచ్ శారదానరేందర్, ఎస్సారెస్పీ డీఈ ఛక్రునాయక్, నేతలు దుంపెట వెంకటేష్, లక్ష్మయ్య, మల్లేశం, శంకర్, సతీశ్, రాజు పాల్గొన్నారు.