సారంగాపూర్, జనవరి 31: ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చాదిద్దారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మన ఊరు-మనబడి, మన ఊరు-మనబస్తీ ద్వారా విరివిగా నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించారని గుర్తు చేశారు. బుధవారం సారంగాపూర్ అర్పల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో 9లక్షలతో నిర్మించనున్న కల్యాణ మండపానికి భూమిపూజ చేశారు. సారంగాపూర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా గత కేసీఆర్ సర్కారు పల్లెల అభివృద్ధికి విరివిగా నిధులు వెచ్చించిందన్నారు. సర్పంచ్లు గ్రామాల ప్రగతిలో ముఖ్య భూమిక పోషించారని అభినందించారు. సారంగాపూర్ దివంగత సర్పంచ్ కొండ్ర మల్లారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు 15, 16 ఏండ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ఆయన తెలుసని, చుట్టుపక్కల 30, 40 గ్రామాలకు సుపరిచితులని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారని, మండలాభివృద్ధికి ఎంతగానో కృషి చేసి సారంగాపూర్ మల్లారెడ్డిగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
ప్రస్తుత సర్పంచ్ గుర్రాల రాజేందర్రెడ్డి చిన్న గ్రామమైన అభివృద్ధిలో ముందువరసలో నిలిపారని ప్రశంసించారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ, ఈ రోజు మన ఊరు-మన బడిలో భాగంగా 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. కేసీఆర్ పాలనలోనే పాఠశాల విద్యారంగం అభివృద్ధి చెందిందన్నారు. కాగా, ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ను, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ఎంపీపీ సొల్లు సురేందర్, సర్పంచ్ కొండ శ్రీలత పాల్గొన్నారు.