జగిత్యాల రూరల్, ఆగస్టు 22: రేవంత్రెడ్డి గుంపు మేస్త్రీ కాదని, తెలంగాణ ముంపు మేస్త్రీ అని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్నాళ్లూ కావాలనే దుష్ప్రచారం చేసి రాష్ర్టాన్ని కరువులోకి నెట్టాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. శనివారం జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉంటుందని నిపుణుల కమిటీ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. జూలై నెల చివరి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు భారీ వరద వచ్చిందని, ఒడిసిపట్టి రిజర్వాయర్లను నింపుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూసిందని, ఫలితంగా నీరంతా వృథాగా పోయిందని మండిపడ్డారు.
సకాలంలో లిఫ్టులు నడిపి ఉంటే మధ్యమానేరు, ఎల్ఎండీ, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను నింపుకునే అవకాశం ఉండేదన్నారు. బీఆర్ఎస్ నేతలు, ఇంజినీర్లు పదేపదే ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాతే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా’ ఆలస్యంగా పంపులు ఆన్ చేశారని ఎద్దేవాచేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక చెంపపెట్టు అని ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరం కుప్పకూలింది.. ప్రాజెక్ట్ వృథా’ అని ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం చేసినందుకుగాను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ టీ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, అవారి శివకేసారి బాబు, దారిశెట్టి రాజేష్, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, అల్లాల ఆనంద్ రావు, శీలం ప్రవీణ్, గాజుల రాజేందర్, పర్వేజ్ మున్నా, మహిపాల్ రెడ్డి, తుమ్మ గంగాధర్, ఆనంద్ రావు, సన్నిత్, గాజుల శ్రీనివాస్, రమేశ్రావు పాల్గొన్నారు.