మెట్పల్లి రూరల్, జనవరి 4: బీఆర్ఎస్ అధికారంలో లేదని కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని, మీ అందరికీ అండగా ఉంటానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థలు, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం గార్డెన్స్లో గురువారం జరిగిన బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ కృతజ్ఞత సభకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నియోజకవర్గ ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తానని స్పష్టం చేశారు. తన గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ధైర్యమిచ్చారు. అధికారంలో లేమని కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయకుంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్లు సుజాత, లావణ్య, ఎంపీపీలు మారు సాయిరెడ్డి, కాటిపెల్లి సరోజ, పార్టీ మండలాధ్యక్షులు నల్ల తిరుపతిరెడ్డి, ఎల్లాల దశరథ్రెడ్డి, తోట శ్రీనివాస్ పాల్గొన్నారు.