మానకొండూర్ రూరల్, నవంబర్ 25: కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ ఆగమైతదని, అలాగే రాష్ట్రం అంధకారమై ప్రతి ఒక్కరూ టార్చిలైట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ను తిరిగి గెలిపించుకుంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని పేర్కొన్నారు. శనివారం మానకొండూర్ మండలంలోని లక్ష్మీపూర్, వేగురుపల్లి, ఊటూర్, ఈదుల గట్టెపల్లి, గంగిపల్లి, కొండపల్కల గ్రామాల్లో మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఊటూర్లో జరిగిన ప్రచారంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెడితే కుక్కలు చింపిన విస్తరైతదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఊర్లలో దుష్ప్రచారం చేస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో రసమయి బాలకిషన్ను గెలిపిస్తేనే, అక్కడ కేసీఆర్ సీఎం అవుతాడని పేర్కొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీలకు గ్యారెంటీ లేదు.. కవ్వంపల్లి మాటలకు వారంటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో దొంగ మాటలు చెబుతూ ఊర్లలోకి వస్తున్న వారిని నమ్మద్దని ప్రజలకు సూచించారు. 10 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
ఎన్నికలు కాగానే ప్రతి దళిత కుటుంబానికీ రూ. 10 లక్షల సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే రసమయి బాలకిషన్ను మరోసారి గెలిపించాలని కోరారు. కాగా, ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్లో చేరిన వారికి ఎమ్మెల్యే, జీవీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీఆర్తో పాటు వినోద్కుమార్కు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గడ్డం నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్టీ గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.