రాయికల్, నవంబర్ 25: ‘ఒకప్పుడు జగిత్యాల ఎట్లుండె.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇప్పుడెలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ఏండ్ల కొద్ది పాలించి చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ ప్రజలకు మేలు చేయలేదు అని’ జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్తోనే పేద ప్రజలకు భరోసా అని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాయికల్ మండలం రాజనగరం, ఆలూర్, వీరాపూర్, ధర్మాజీపేట, కైరిగూడెం, వస్తాపూర్, దావన్పల్లి గ్రామాల్లో శనివారం ప్రచారం చేశారు.
వీధివీధినా పర్యటిస్తూ ప్రజలను ఓటు అభ్యర్థించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తు న నిధులు మంజూరు చేయడంతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు కరెంటు కష్టాలు లేవని, వ్యవసాయానికి 24 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్దేనని కొనియాడారు.
ప్రతి గ్రామం లో అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని, ప్రజలు కోరిన సమస్యలను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిషరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆసరా పింఛన్ను పెంచుకుందామని, విడతలవారీగా రూ.5016 చేస్తామన్నారు. ఇంటింటికీ కేసీఆర్ బీమా కింద పేదలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా అందజేస్తామన్నారు. ఇంకా రేషన దుకాణాల ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం పేద మహిళలకు నెలకు రూ.3వేల జీవన భృతి అందిస్తామని, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళా సమైక్య సంఘాలకు సొంత భవనాలను నిర్మిస్తామన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు అధికార దాహంతో అడ్డగోలు గా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. ఫేక్ హామీలు ఇస్తూ, అబద్ధాలు చెబుతున్నారని, నమ్మి తే మోసపోతారని చెప్పారు. ‘నేను మీ బిడ్డను. ఎల్లవేళలా మీ వెంటే ఉంటా. కష్టమొస్తే ఆదుకుంటా. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. జగిత్యాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని’ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ సభ్యురాలు జాదవ అశ్విని, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్. సర్పంచులు, భాగ్యలక్ష్మి, యమున, స్నేహలత,చంద్రకళ, లక్ష్మీ, సుమలత, చిన్న మల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు సురేందర్ రెడ్డి, నాగరాజు, పద్మ, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ఉపసర్పంచులు ఉన్నారు.