సుల్తానాబాద్, జూన్ 25 : పెద్దపల్లి నియోజకర్గంలో మూడోసారీ ఎగిరేది గులాబీ జెండానేనని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సుల్తానాబాద్లోని ఎస్వీఆర్ గార్డెన్లో ఆదివారం సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారీ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎగిరేది గూలాబీ జెండానేనని, హ్యాట్రిక్ సాధించి చరిత్రలో నిలిచిపోతామని స్పష్టం చేశారు.
తొమ్మిదేళ్ల పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు కాంగ్రెసోళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంటు విజయరమణారావు గ్రామాల్లో తిరుగుతూ అభివృద్ధి అంతా తానే చేసినట్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నీ హయాంలో జరిగిన అభివృద్ధి, నా హయంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పట్టణంలో రూ. 5 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేశామని, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ల అసమర్థతతో రూ. 18 లక్షల పనులు నిలిచిపోయాయన్నారు. పూసాల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేపడుతున్నామనీ స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి గట్టెపల్లి రోడ్డు వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని త్వరలో చేస్తామని తెలిపారు. నిరంతర తాగునీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ పైపు లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2 వేలకు పెంచామన్నారు.
మన ఉరు – మన బడి పథకంలో సుల్తానాబాద్ బాలుర పాఠశాలకు నూతన భవనం నిర్మాణం కోసం రూ. కోటీ 10 లక్షలు మంజూరయ్యాయన్నారు. మీట్ మార్కెట్ను రూ. 75 లక్షలతో నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంలో ఉందన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానా శిథిలావస్థలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన భవనం ఏర్పాటు చేసుకుని 30 పడకల దవాఖానగా రూపాంతరం చెందిందన్నారు. ఈ దవాఖానను 50 పడకల హాస్పిటల్గా చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఇన్నీ పనులు జరుగుతున్నా కాంగ్రెసోళ్లకు కనిపిస్తలేదన్నారు. చేయని పనులను సైతం తామే చేసినట్లు చెప్పుకునే నీచస్థితికి కాంగ్రెస్ నాయకులు మిగిలారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిపై నోరు జారితే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతరమేష్గౌడ్, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతకృష్ణ, పార్టీ మండలాధ్యక్షుడు పురం ప్రేమ్చందర్రావు, పటణాధ్యక్షుడు పారుపెల్లి గుణపతి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.