మేడిపల్లి, ఏప్రిల్ 26 : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటామని అభయమిచ్చారు. బుధవారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటించి, అకాల వానలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. భీమారం మండలం గోవిందారం, పసునూర్, దేశాయిపేట, రాజలింగంపేట, మన్నెగూడెం గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించారు. గోవిందారంలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందగా, రైతు గంగనవేని దేవయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ధాన్యం తడిసి ముద్దయిన మొలకలను చూసి ఆవేదన చెందారు. మన్నెగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్, తాండ్య్రాల గ్రామాల్లో పంటలను పరిశీలించారు. అనంతరం రుద్రంగి, కోనరావుపేట మండలం నిమ్మపల్లితోపాటు చందుర్తి, మర్రిగడ్డ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి, బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు.
అకాల వర్షంతో జరిగింది పంట నష్టం కాదని.. పంట విధ్వంసం జరిగిందన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరగడం బాధాకరమన్నారు. రైతులకు సర్కారు అండగా ఉంటుందని, పండించిన ప్రతి గింజనూ కొంటుందని చెప్పారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతుల వివరాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచులు ద్యావనపెల్లి అభిలాష్, ఈర్నాల సంపత్ కుమార్, గాజోజి చారి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చెన్నమనేని రవీందర్ రావు, ఎంపీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, కో ఆప్షన్ సభ్యుడు షేక్ హైమద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదగిరి రమ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొప్పెర లింగారెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ గోపిడి మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, డైరెక్టర్లు కొండ కిషన్, రెబ్బస్ మల్లయ్య, ఏపీఎం గట్ల అశోక్, ఏవో త్రివేదిక, నాయకులు నెల్లుట్ల ప్రభాకర్, లోలపు రాజరెడ్డి, గండ్ర సురేందర్రావు తదితరులు పాల్గొన్నారు.