మల్లాపూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండపైకి ఆర్అండ్బీ శాఖ నిధులు 10 కోట్లతో చేపట్టనున్న ఘాట్ రోడ్డు నిర్మాణం, 2.20 కోట్లతో ఒడ్డెర కాలనీలో హై లెవల్ వంతెన నిర్మాణాలకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 50 ఏండ్లకు పైగా పాలించిందని, ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. ఎన్ని తరాలు మారిన ప్రజల తలరాతలు మారలేదని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ల పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు బీమా, రైతుబంధు, మిషన్కాకతీయ, మిషన్ భగీరథతో రాష్ర్టానికి ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు అందిస్తున్న ఒక్క పథకమైనా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అందించే స్థితిలో లేరని, అక్కడ అభివృద్ధి కూడా శూన్యమని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని, తట్టెడుమట్టి తీయలేని ఎంపీ, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్కు వందకు పైగా సీట్లు రావడం ఖాయమని, కోరుట్ల
ఎమ్మెల్యేగా సంజయ్ కల్వకుంట్లను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని
సూచించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాలుఅన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని, కోరుట్ల నియోజకవర్గం ప్రగతిలో ముందు వరుసలో నిలుస్తుందన్నారు. అంతకు ముందు మంత్రి, ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించి, సోమేశ్వరస్వామి చిత్రపటాలను అందజేశారు. ఇక్కడ ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో మధు, తహసీల్దార్ వీర్సింగ్, ఎంపీడీఓ జగదీశ్, వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్, ఎంపీటీసీ-1 ఆకుతోట రాజేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మండలాధ్యక్షుడు కొమ్ముల జీవన్రెడ్డి, మాజీ మార్కెట్కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, వైస్ చైర్మన్ ముద్దం శరత్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామిగౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సంగ గంగారాజం, బీఆర్ఎస్వై మేకల సతీశ్ పాల్గొన్నారు.
ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే బాధ్యత నాదే
ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని నాయకులు ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో గ్రామాలకు వస్తారు. వాళ్లు ఏమి చేశారో ప్రజలు అడగాలి. ప్రతిపక్షాల మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నాదే. సోమేశ్వర కొండ ఘాట్ రోడ్డు నిర్మాణానికి నా కొడుకు సంజయ్ కల్వకుంట్ల ఎంతో కృషి చేశాడు. రానున్న రోజుల్లో శ్రీ కనకసోమేశ్వరస్వామి దేవస్థానాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్యే
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
రానున్న రోజుల్లో అందరి సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు నా వంతు కృషి చేస్తా. నేను గతంలో మల్లాపూర్ మండలానికి వచ్చినప్పడల్లా ఇక్కడి ప్రజలు, మా లీడర్లు అందరు సోమన్న గుట్టకు ఘాట్రోడ్డు, మండల కేంద్రంలో
మినీస్టేడియం నిర్మించాలని అడిగారు. ఇది వరకే మల్లాపూర్లో క్రీడకారుల కోసం మినీ స్టేడియం నిర్మించాం. ఇప్పుడు సోమన్న గుట్టకు ఘాట్రోడ్డును నిర్మించుకుంటున్నాం. ఇవాళ 10 కోట్ల నిధులను తెచ్చి మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. మిగిలిన రెండు, మూడు పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తా. మన బాపు కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేయండి. మీ కోసం పనిచేసే, మీ మధ్య ఉండే నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. నియోజకవర్గ ప్రజల కలలను నెరవేరుస్తా.
– సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి